Sidabad Girl Rape Case Update: హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడ్డ కామాంధుడు రాజును ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ నిందితుడిని పట్టుకోలేకపోయారంటూ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వంపై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రేపిస్ట్ రాజును వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిందితుడ్ని పట్టుకుని ఎన్ కౌంటర్ చేసి పారేస్తామని వ్యాఖ్యానించారు. మీరు ఇప్పటివరకూ ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించలేదని మీడియా ప్రశ్నించగా.. మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


మేడ్చల్ నియోజకవర్గ నూతన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ మంగళవారం సమావేశమైంది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సేవల్ని కొనియాడారు. పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి అందరూ పనులు చేసుకుంటున్నారని, అందుకు కారణం ఇక్కడి పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసిఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు 18.37 కోట్ల రూపాయలతో ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం కల్పించారని.. మడమ తిప్పని పోరాటంతో రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం కారణంగా మిగిలిన పార్టీలకు కనీస ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ మూడొంతుల సీట్లు గెలుచుకోవడంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేంద్ర స్థలం ఇచ్చిందన్నారు.


Also Read: సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు.. సీపీ ప్రకటన  


సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని, మీరు వెళ్లి ఎందుకు పరామర్శించడం లేదని మంత్రి మల్లాడరెడ్డిని ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించింది. తెలంగాణలో అందరికీ న్యాయం జరుగుతుందని, చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడుతున్నా నిందితుడు రాజును పట్టుకుని ఎన్ కౌంటర్ చేసి పారేస్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రతి పని అంత త్వరగా జరగదని, కొంత సమయం పడుతుందన్నారు. త్వరలోనే నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారికి నష్ట పరిహారం అందజేస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.


Also Read: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా? 


నిందితుడి ఆచూకీ చెబితే భారీ నజరానా..


ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని వెల్లడించారు. పది బృందాలుగా ఏర్పడి పోలీసులు హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.