KTR Comments on Telangana Lok Sabha Election Results: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన దారుణ పరాభవం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన ఈ 24 ఏళ్లలో తాము ఎన్నో ఎత్తు పల్లాలను చూశామని గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా తాము రెండు సార్లు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని చెప్పారు. ప్రస్తుత ఫలితాలు తమను బాగా నిరాశపరిచాయని అన్నారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఓ పోస్టు చేశారు.


‘‘పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం.


ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయి. అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న విశ్వాసం మాకు ఉన్నది. ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటాం’’ అని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.