Telangana Rains: నిజామాబాద్: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తెలంగాణలో పలు జిల్లాల్లో రైతులకు పంట నష్టం జరిగింది. అయితే ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నదాతలకు శుభవార్త చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలని  నిర్ణయించినట్లు తెలిపారు. 


నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లి 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జూపల్లి  కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే అన్నట్లు బీఆర్ఎస్ (BRS Party) నాయకుల తీరు ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన వారం గడువక ముందే ఇది అమలు చేయలేదు అని అధికార కాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అవుతుంది. ఒక్క సీట్ నెగ్గడం గగనమే. త్వరలో బీఆర్ఎస్ పార్టీ మూతపడుతుంది. ప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు. 


ఆ రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం
ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతన్నలు నష్టపోయారు. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురికావద్దు. పంట నష్టంపై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతన్నల ఆత్మస్థెర్యం దెబ్బతినొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని’ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోలేదంటూ ఆరోపణలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అకాల వర్షాలు, వరదలు వచ్చినా, కరువు వచ్చి పంటలు దెబ్బతిన్న గత పదేళ్లలో పంట నష్టం కింద సాయం చేయలేదని.. కనీసం పంట నష్టంపై నివేదికలు కూడా తెప్పించలేదన్నారు జూపల్లి కృష్ణారావు. రైతు భరోసా పథకం ద్వారా 3.5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే రూ. 4,295 కోట్లు జమ చేశామన్నారు. 69.86 లక్షల రైతులకు గాను 58.66 లక్షల మంది రైతులకు రైతు భరోసా చెల్లించారు. మిగిలిన రైతులకు వారం రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలు తీరుస్తూనే, మూడు నెలల స్వల్ప కాలంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 


ఒకటో తారీకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం. 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అధిక వడ్డీ భారమైన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.