Paddy Cultivation: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం

ABP Desam Updated at: 06 Nov 2021 09:55 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

యాసంగిలో వరి సాగు చేయవద్దని, కొనుగోలు చేయమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలం వరిపంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు యాసంగిలో ఇతర పంటలు సాగుచేయాలన్నారు

మంత్రి నిరంజన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

NEXT PREV

తెలంగాణలో యాసంగిలో వరి సాగు చేయవద్దని, ప్రభుత్వం కొనుగోలు చేయదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యాసంగిలో సాగు చేసే పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్పష్టం చేశారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత మరెవరికీ లేదన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాసంగిలో తేమ కారణంగా బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం చెప్పిందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనమని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. 



వానాకాలం వరి కొనుగోలు


యాసంగిలో రైతులు వరి సాగు చేయకుండా ఇతర పంటలు వేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.  విత్తన కంపెనీలతో ఒప్పందాలున్న రైతులు, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చని సూచించారు. వానాకాలంలో సాగుచేసే వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సాగు రంగాన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారన్నారు. ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.


Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?



‘‘తెలంగాణ నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్రం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు. దానికి బదులు ఇతర పంటలు సాగుచేయండి’’ - నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి


Also Read: నాడు ఏం చెప్పారు ? నేడు ఏం చేస్తున్నారు ? పెట్రో ధరలను తగ్గించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం !


రాష్ట్రానికి ఎక్స్ పోర్ట్స్ అనుమతులు లేవు


విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు, రైస్ మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి సాగుచేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అయితే వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగుమతుల అనుమతులు ఉండవని పేర్కొన్నారు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదని గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వీటిని అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.


Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

Published at: 06 Nov 2021 07:05 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.