Telangana Government Ordered Lasya Nanditha Last Rites With Official Ceremonies: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అటు, గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం ఆమె నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. పలువురు నేతలు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశాన వాటికలో శుక్రవారం సాయంత్రం లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 


కేసీఆర్ పరామర్శ


బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కార్ఖానాలోని నివాసంలో లాస్య నందిత పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు ఇతర నాయకులు లాస్య నందితకు నివాళి అర్పించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నారు. 


మరోవైపు, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, లాస్య నందిత ప్రమాదానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యే కారు రెయిలింగ్ తో పాటు ముందున్న లారీని ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. అతి వేగంతో వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్లను గుర్తించారు. కారు బానెట్ పై భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. ఎడమ వైపున ఉన్న ముందు చక్రం ధ్వంసంమైంది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మీటర్ బోర్డు 100 కి.మీ స్పీడ్ వద్ద స్ట్రైక్ అయినట్లు గుర్తించారు. నందిత కారు బానెట్ పై భాగంలో అంటుకుని ఉన్న ఇసుకను క్లూస్ టీం సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రెయిలింగ్ ను మాత్రమే ఢీకొంటే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, పూర్తి స్థాయి విచారణ అనంతరమే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


Also Read: Lasya Nanditha Accident: ఎమ్మెల్యే లాస్య నందితకు వరుస ప్రమాదాలు - రెండు ప్రమాదాలు తప్పినా మూడోసారి వెంటాడిన మృత్యువు