Akash Strikes : రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌దీప్‌(Akash Deep) అదరగొడుతున్నాడు. అద్భుతమైన బంతులతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలుత క్రాలేను అద్భుతమైన బంతితో ఆకాశ్‌దీప్‌ బౌల్డ్‌ చేసినా అది నో బాల్‌ కావడంతో క్రాలే బతికిపోయాడు. అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఆకాశ్‌ దీప్‌... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్‌ తీసి బ్రిటీష్‌ జట్టను కోలుకోలేని దెబ్బ తీశాడు. పదో ఓవర్లో డకెట్‌ను అవుట్‌ చేసిన ఆకాశ్‌... ఒక బంతి విరామం తర్వాత ఒలిపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బ్రిటీష్‌ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్‌ చేసిన ఆకాశ్‌ ఇంగ్లాండ్‌ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు 57 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

 

తుది జట్టు ఇలా...

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. రెండు మ్యాచుల్లోనూ విఫలమైన రజత్‌ పాటిదార్‌పై భారత మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది. పాటిదార్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్‌ శర్మ ప్రకటించాడు. వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో...ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఆకాశ్‌దీప్‌కు స్థానం దక్కింది. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌ జట్టులోకి వచ్చాడు. వన్‌ డౌన్‌లో గిల్‌, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు రానున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్‌ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది. ఎవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది. బుమ్రా గైర్హాజరీలో జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌, ఆకాశ్‌దీప్‌లతో కూడిన బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడపనున్నాడు.  ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కూడిన కూర్పు మంచి ఫలితాలు ఇవ్వడంతో..భారత్ అదే తరహా జట్టును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది.

జోరు మీద భారత్‌

 మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో గెలిచి జోరు మీదున్న భారత్ నాలుగో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలానైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. తొలి టెస్టు పరాభవం తర్వాత గాడిలో పడ్డ భారత్.... తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్ గెలిస్తే స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్‌ విజయాలు భారత్‌ ఖాతాలో చేరతాయి.స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేనప్పటికీ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండటం భారత్‌కు సానుకూల అంశంగా మారింది. మూడో టెస్టులో ద్విశతకంతో అదరగొట్టిన యశస్వి జైశ్వాల్‌...... ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.


భారత్ తుదిజట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్


ఇంగ్లండ్ తుది జట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్