Telangana News: తడిసిన ధాన్యాన్ని వేలంలో అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏక మొత్తంలో కాకుండా విడతల వారీగా విక్రయించేలా అధికారుల కమిటీ ప్రణాళికలు రచిస్తోంది. తొలి విడతగా 15 నుంచి 20 లక్షల టన్నుకలకు బహిరంగ వేలం వేసేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. కోటి టన్నుల తడిసిన ధాన్యాన్ని విక్రయించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు. వేలంలో క్వింటాకు రూ.2,250 నుంచి రూ.2,300 వరకు ధర నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంవత్సరం, సంవత్సరానికి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రైల్ మిల్లుల సామర్థ్యం అంతలా పెరగలేదు. దీని వల్ల తెలంగాణ ఉత్పత్తి అయ్యే ధాన్యానికి సీఎంఆర్కు మధ్య అంతరం, నిల్వ చేసేందుకు స్థలాభావంతో సమస్యలు వచ్చాయి. గతేడాది వానాకాలం, యాసంగి పంట కలిపి.. కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇందుకు సెప్టెంబర్ నెలాఖరు వరకే గడువు ఉంది. 


వర్షాకాలం మిల్లంగే ఇప్పటికీ పూర్తి కాలేదట


వర్షాకాలం పంట మిల్లింగే ఇప్పటికీ పూర్తి కాలేదని.. ప్రస్తుతం యాసంగిలో తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలంటూ తమపై ఒత్తిడి తీసుకు వచ్చారని పౌర సరఫరాల సంస్థకు రైస్ మిల్లర్ల సంఘం ఇప్పటికే తెలిపింది. అయితే తాము ఈ పంటకు కస్టోడియన్ గా మాత్రమే ఉంటామని వివరించారు. వచ్చే అక్టోబరులో వర్షా కాలం పంట దిగుబడి మరో కోటి టన్నులకు పైగా రాబోతుందని చెప్పారు. ఈక్రమంలోనే నిల్వ పంటను వేలం వేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని సమాచారం. ఇందులో యాసంగిలో వచ్చిన 66.02 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యాసంగి ధాన్యం మిల్లింగ్ లో నూక శాతం ఎక్కువగా ఉంటుందని... అకాల వర్షాలకు పంట పలుమార్లు తడిసిందని పౌర సరఫరాల సంస్థ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ పంటనే ముందుగా వేలం వేస్తామని వివరించారు. 


మిల్లర్లు మాత్రమే కాదు ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చు!


ఈ తడిసిన ధాన్యం వేలంలో కేవలం మిల్లర్లు మాత్రమే కాకుండా ఎవరైనా పాల్గొనేలా గ్లోబల్ టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040, చెల్లించి రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. అలాగే ఐకేపీ కేంద్రాలకు ఇచ్చిన కమీషన్ రైస్ మిల్లులకు చేర్చేందుకు రవాణా ఛార్జీలు, ధాన్యం కొనుగోలుకు బ్యాంకు నుంచి తీసుకున్న రుణంపై వడ్డీ, ఇతర ఖర్చుల్ని కూడా  పౌరసరఫరాల సంస్థ అధికారులు తాజాగా లెక్కలు వేశారు. మొత్తంగా క్వింటారు రూ.2,250 నుంచి రూ.2,300 వరకు ఱర్చు అయినట్లు తేల్చారు. బహిరంగ వేలంలో ఈ మొత్తాన్నే కనీస ధరగా నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు ఐఏఎస్ అధికారుల కమిటీలోని ఓ అధికారి వెల్లడించారు. వేలం ధర తగ్గించి నష్టానికి అమ్మలేమని స్పష్టం చేశారు. చేసిన ఖర్చును రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.  


ప్రతి క్వింటాకు 10 కిలోల తరుగు ఇవ్వాలంటున్న మిల్లర్లు


యాసంగిలో అధికంగా వచ్చే నూకలకు క్వింటారు రూ.200, నుంచి రూ.300 వరకు నష్ట పరిహారం ఇవ్వాలని మిల్లర్లు అడుగుతున్నారని, వేలంతో అంశం ఉత్పన్నం కాదని చెప్పారు. మిల్లర్లు మాత్రం యాసంగి ధాన్యంలో నూకలు ఎక్కువ వస్తాయని, వానలకు పంట తడిసిందని.. వేలంలో ప్రతి క్వింటారు 10 కిలోల తరుగు ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థను కోరారు. అయితే ధాన్యం వేలం వేసే విషయాన్ని పౌర సరపరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ భారత ఆహార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఆర్ లో జాప్యం, నిల్వకు స్థలం లేకపోవడం, త్వరలో వానాకాలం పంట రానుండడం ఎఫ్సీఐ ప్రమాణాల మేరకు మిల్లర్లు బియ్యాన్ని ఇచ్చే పరిస్థితులు లేకపోవడాన్ని వివరించినట్లు తెలిసింది. దీంతో వేలానికి ఎఫ్సీఐ ఆమోదం తెలిపినట్లు సమాచారం.