Airport Metro Alignment Changed: ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్ - బెంగుళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ఖరారు చేసింది. కారిడార్ - 4లో నాగోల్ - శంషాబాద్ విమానాశ్రయం వరకూ 36.6 కి.మీ మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భంలో వెళ్లనుంది. కాగా, మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారీ పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ  శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. 


రెండో దశ కారిడార్లు ఇవే..



  • వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, సీఎం రేవంత్ మెట్రో రెండో దశ కారిడార్ల విస్తృత కాంటూర్లను ఆమోదించారు. కారిడార్ VI (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవును కవర్ చేస్తుంది. ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చంద్రాయణ్ గుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా NH మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ ఎయిర్ పోర్ట్ స్టేషన్‌తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి.

  • కారిడార్ V రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయో డైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి.

  • కారిడార్ VI (ఓల్డ్ సిటీ మెట్రో) ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్‌ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా ఉంచుతారు. ప్రస్తుతం దారుల్‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు; శాలిబండ జంక్షన్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు ఏకరీతిగా 100 అడుగులకు విస్తరిస్తారు. స్టేషన్ ఉండే ప్రాంతాల్లో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తారు.

  • కారిడార్ VII ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభించి, పటాన్‌చెరు వరకు ఉన్న ఈ 13.4 కి.మీ లైన్ ఆల్విన్ X రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్.

  • కారిడార్ VIII విజయవాడ హైవేపై ఎల్బీ నగర్ వైపు నుంచి రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిమీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళ్తుంది. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి.


 మరోవైపు, రూ.8 వేల కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు తుది మెరుగులు దిద్దుతుండగా.. త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం పంపనున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు. 


Also Read: MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్