Mahendar Reddy as TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదించారు. స్క్రీనింగ్ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించినా చివరకు మహేందర్ రెడ్డినే టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది.


ఇదీ నేపథ్యం



  • మహేందర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామం. ఆయన 1986వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వారు.

  • మహేందర్ రెడ్డి రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పని చేశారు.

  • జాతీయ పోలీస్ అకాడమీలో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించిన ఆయన.. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ కమిషనరేట్ కు మొదటి కమిషనర్ గా నియమితులయ్యారు.

  • మూడేళ్లు సైబరాబాద్ సీపీగా సుదీర్ఘంగా సేవలందించిన మహేందర్ రెడ్డి.. పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తర్వాత గ్రేహౌండ్స్, పోలీస్ కంప్యూటర్ విభాగాల్లో విధులు నిర్వహించారు. కీలక ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగానూ పని చేశారు.

  • తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి.. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

  • 2017 నవంబర్ లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ వరకూ ఆ పదవిలో కొనసాగారు. తాజాగా, ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు.


పారదర్శకతకే ప్రాధాన్యం


గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శల పాలయింది. మళ్లీ మళ్లీ పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అందుకు అనుగుణంగా కమిషన్ మొత్తాన్ని ప్రక్షాళన చేసి కొత్త బోర్డును నియమించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్‌, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్‌ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉండగా.. ఛైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించారు. ఇక, బోర్డులో కీలకమైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పోస్టుకు నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణ ఐఏఎస్ ను ఈ పోస్టులో నియమించాల్సి ఉంటుంది. గతంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ గా పని చేసిన ఐఏఎస్‌ అధికారి సంతోష్‌.. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.


ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైన నేపథ్యంలో ఇక సభ్యుల నియామకంపై దృష్టి సారించనుంది. కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పోటీ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరును పరిశీలించనుంది. తర్వాత అధ్యయన నివేదిక సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. కొత్త బోర్డు నియమించిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రూప్‌-2 పరీక్షలతో  ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించనుంది.


Also Read: Warangala Student: జాతీయ స్థాయిలో వరంగల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాలల పురస్కారం