MLAs Poaching Case :   ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఈ మేరకు బుధవారం అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సిట్ దర్యాప్తు సాగించాలని డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐకీ కేసు బదిలీ నిలిపివేయాలని ఆ పిటీషన్ లో కోరింది.  దీనిపై తెలంగాణ హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం గురువారం  విచారించనుంది.


ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని ..ముఖ్యమంత్రికి  సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి  ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను  బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం  న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు. అయితే సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదు. 


సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ట్రాప్ చేశారు. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  ఏసీబీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని.. సీనియర్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో సీట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని సిట్ పిలిచింది. కానీ నిందితులు తమకు ఈ కేసుతో సంబంధం లేదని అయినా విచారణకు పిలుస్తున్నారని.. కేసు దర్యాప్తును సీబీఐకి ఇప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. 


భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) నలుగురు ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం, బిజెపికి అనుకూలంగా మారేందుకు వారిని ఆకర్షించడం వంటి పనులకు ఆ ముగ్గురు నిందితులు పాల్పడ్డారన్నది ఆరోపణ. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ అనే ఆ ముగ్గురు నిందితులు మోయినాబాద్ ఫారమ్ హౌస్‌లో ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టే, బిజెపి పార్టీలోకి ఆకర్షించే మంతనాలు జరిపారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురు ఎంఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చేలా వారు ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ముగ్గురు బిజెపి ఏజెంట్లని ఆరోపణ.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)ను నవంబర్ 9న ఏర్పాటు చేసింది.  


భట్టి మినహా సీనియర్లంతా డుమ్మా - ఖర్గేనూ లెక్క చేయని నేతలు ! టీ కాంగ్రెస్‌లో వాట్ నెక్ట్స్ ?