హైదరాబాద్‌ మెట్రో సంస్థలో పని చేసే ఉద్యోగులు చేస్తున్న ధర్నా రెండో రోజు కూడా కొనసాగుతూ ఉంది. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మెట్రో టికెటింగ్ సిబ్బంది నిన్నటి నుంచి (జనవరి 3) నిరసన చేస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో సంస్థ ఆఫీస్ వద్ద టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. మెట్రోలో తమకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడం సహా, తమ జీతం ప్రస్తుతం ఉన్న రూ.11 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి జీతాలు పెంచలేదని వారు వాపోతున్నారు. 


నిన్న మంగళవారం కూడా మెట్రో రైల్‌ టికెటింగ్ సిబ్బంది అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో నిరసన చేశారు. తమకు జీతాలు పెంచాలని దాదాపు 300 మంది ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్టేషన్స్ లో టికెట్ కౌంటర్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు దాదాపు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని వాపోయారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఉద్యోగం విషయంలోనూ చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఒకరు ఉద్యోగం చేస్తుంటే సమయానికి రావాల్సిన రిలీవర్ రాకపోయినా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం ఉండని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు.


నిన్న మెట్రో సిబ్బంది ధర్నా చేయడంతో సిబ్బంది కాంట్రాక్ట్ ఏజెన్సీ అయిన కియోలిస్ సంస్థ వారితో చర్చలు జరిపింది. దాంతో ధర్నా తాత్కాలికంగా విరమిస్తున్నట్లుగా వారు తెలిపారు. వేతనాల పెంపు విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి చెప్తామని హామీ ఇచ్చారు. అయితే, స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ విధులకు హాజరుకాబోమని సిబ్బంది తేల్చి చెప్పారు.