Telangana BJP Manifesto 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 'సకల జనుల సౌభాగ్య తెలంగాణ' పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా హైదరాబాద్ లో శనివారం రాత్రి 'మన మోదీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా ' పేరుతో కీలక అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రధానంగా 10 అంశాల కార్యాచరణతో దీన్ని రూపొందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు.  మహిళలు, నిరుద్యోగులు, రైతులకు మేలు చేకూరేలా పలు హామీలను పొందు పరిచారు. బీసీని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. మహిళలకు 10 లక్షల ఉద్యోగాల కల్పన, EWS కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.


మేనిఫెస్టోలో కీలక అంశాలివే



  • 'ధరణి'కి బదులు 'మీ భూమి' యాప్, ప్రజలందరికీ సమర్థమంతమైన, సుపరిపాలన

  • బీసీని తెలంగాణ తొలి సీఎంగా చేయడం

  • పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు

  • గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ, మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు

  • ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు

  • డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థినులకు ఉచిత ల్యాప్ టాప్స్, ఉజ్జ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు

  • మహిళా రైతుల కోసం మహిళా కార్పొరేషన్ ఏర్పాటు, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు 1 శాతం వడ్డీకే రుణాలు.

  • UPSC తరహాలోనే 6 నెలలకోసారి TSPSC ద్వారా ఉద్యోగాల భర్తీ, గ్రూప్ - 1, 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ, EWS కోటా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామని హామీ.

  • వయో వృద్ధులకు ఉచితంగా కాశీ, అయోధ్య యాత్ర, జాతీయ స్థాయిలో మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర నిర్వహణ.

  • సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం, బైరాన్పల్లి, పరకాల ఊచకోతను స్మరించుకుంటూ ఆగస్ట్ 27న 'రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం' నిర్వహణ.

  • రైతులకు ఎరువుల సబ్సిడీతో (ఎకరాకు రూ.18 వేలు) పాటు రూ.2,500 ఇన్ పుట్ అసిస్టెన్స్, పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచిత పంట బీమా

  • వరికి రూ.3,100 మద్దతు ధర, పసుపు మార్కెట్ కోసం ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు, ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ

  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికోసారి  ఉచిత వైద్య పరీక్షలు. జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రోత్సాహం.

  • పోలీసులు, హోంగార్డులు, కాలేజీ విద్యార్థులు, ఇతర వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ.

  • రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు. అందరికీ కొత్త ఇల్లు ఉండేలా చర్యలు

  • ఆహార ధాన్యాల అక్రమ రవాణా నివారించి, నాణ్యమైన రేషన్ పేదలకు అందేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు. 

  • నిజామాబాద్ ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు

  • మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు, బడ్జెట్ స్కూళ్లకు పన్ను మినహాయింపు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల విధానంపై పర్యవేక్షణ

  • ఆడబిడ్డ భరోసా కింద నవజాత బాలికకు బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, 21 ఏళ్లు వచ్చే నాటికి రూ.2 లక్షలు అందజేత

  • సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రీయింబర్స్ మెంట్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.

  • న్యాయవాదులపై దాడుల నిరోధానికి 'లాయర్ల రక్షణ చట్టం'

  • హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ ప్రారంభానికి చొరవ, హైదరాబాద్ లో రవాణా, పారిశుద్ధ్యం, ముంపు, రోడ్లు, ట్రాఫిక్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు.

  • కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమీక్ష


కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయని అమిత్ షా అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ సరిగ్గా వ్యవహరించలేదని, గతంలో వాజ్ పేయి ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు లేవని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణకు రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కరోనా సమయంలో దేశమంతా ఉచిత రేషన్ ఇచ్చామని, తెలుగు రాష్ట్రాలకు 3 వందే భారత్ రైళ్లు కేటాయించామని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న ఆయన, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Also Read: Bandi Sanjay: 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు' - బీజేపీని చూసి సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందన్న బండి సంజయ్