MLA Guvvala Balaraju: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet)లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ (Telangana Congress Party), బీఆర్ఎస్ (BRS) మధ్య ఘర్షణ, ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణలో గువ్వల బాలరాజు (Guvvala Balaraju) నుదిటిపై గాయలు అవడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్‌లను తరలిస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు వెంబడించారు. 


డబ్బు తరలిస్తున్న వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాహనం అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ (Vamsi Krishna) ఆందోళన చేపట్టారు. 


స్థానిక పోలీసులు, గువ్వల గన్‌మెన్లు, ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు‌కు సపోర్ట్ చేస్తున్నారంటూ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు.


అయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపైనే రాళ్లతో దాడి చేశారని గువ్వల బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. వంశీకృష్ణ స్వయంగా రాయి తీసి విసిరేయగా అది ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటికి తగిలిందని, వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తలపై బలమైన దెబ్బ తగలడంతో గువ్వల అపస్మారక స్థితికి చేరుకున్నారని ఆరోపించారు. 


ఓటమి భయంతోనే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజలే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాయి బలంగా నుదిటిని తాకడంతో గువ్వల బాలరాజు పల్స్ పడిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు చెప్పారు. 


ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కోట ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అయితే ఈ దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.


బాలరాజు ఓ అరాచక శక్తి
అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరాచక శక్తి గా తయారయ్యాడని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుల సంచులతో రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. గువ్వల బాలరాజు ఒక కారులో డబ్బుల సంచులతో పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, దాన్ని ఆసరా చేసుకొని గువ్వల బాలరాజు అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేశారని ఆరోపించారు.


తిరిగి కాంగ్రెస్ వాళ్లే దాడులు చేసారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దెబ్బలు తగిలాయని నాటకాలు ఆడుతూ గువ్వల బాలరాజు సానుభూతి కోసం ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అచ్చంపేట ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత
నామినేషన్ల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. భారీగా అభిమానులు, కార్యకర్తలు మందిమార్బలంతో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. 


ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ తరపున అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం (నవంబరు 9) నామినేషన్‌ వేయడానికి వెళ్తుండగా  బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో కొట్టుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు.  ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కోట ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే.