Koneru Konappa meets Revanth Reddy :  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును కోనప్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో పార్టీ వీడేందుకే సిద్ధమతున్నట్లుగా సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పాల్వయి హరీష్ చేతిలో ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ పోటీ చేశారు. ఆయన భారీగా ఓట్లు చీల్చడంతో కోనప్ప ఓటమి పాలయ్యారు. 2014లో కాంగ్రెస్ లో టిక్కెట్ రాకపోవడంతో బీఎస్పీ బీఫాం మీదే కోనప్ప సిర్పూర్ లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు. 


బీఎస్పీతో పొత్తును వ్యతిరేకిస్తున్న కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి                        


బీఎస్పీ పొత్తు విషయంలో కేసీఆర్ నిర్ణయంపై మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా గుర్రుగా ఉన్నాయని సమాచారం. వీరు కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా, గతంలో ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో వారు బీఆర్ఎస్ గూటికి చేరగా పొత్తు వ్యవహారంలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఎస్పీతో పొత్తు వ్యవహారం నచ్చక మరికొంత మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబితే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీ డ్యామేజీ తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.  


కనీసం మాట మాత్రంగా చెప్పకుండా పొత్తులు పెట్టుకున్నారని అసహనం                                    


లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీఎస్పీ ఒక్కటయ్యాయి. ఈ మేరకు పొత్తుపై   ఇరు పార్టీల అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సమావేశం అనంతరం కలిసే పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  మంగళశారం మాజీ సీఎం కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా క‌లిశారు. బంజారహిల్స్‌లోని నంది నగర్ నివాసంలో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. పొత్తుపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు.  


ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్‌కు ఇబ్బందులే               


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు ఏదీ కలసి రావడ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. బీఎస్పీతో పొత్తు కారణంగా ఎంత లాభం జరుగుతుందో కానీ అంత కన్నా ఎక్కువగా నష్టం జరుగుతుందన్న ఆందోళన .. బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది.