Secunderabad Protest Case Filed : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ ఉద్యోగార్ధులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341, రెడ్ విత్ 149తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. కేసు దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఎంత మంది దాడిలో పాల్గొన్నారో ఇంకా గుర్తించలేదన్న ఆమె, ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదన్నారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అనురాధ తెలిపారు. 


దాడిలో 1500 మంది 


సికింద్రాబాద్‌ ఆందోళనలపై ఎలాంటి కుట్రకోణం లేదని, దర్యాప్తులో అన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ అనురాధ చేశారు. ఈ దాడిలో సుమారు 1,500 మంది పాల్గొన్నారని తెలిపారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఆందోళనలపై ఇండియన్‌ రైల్వే యాక్ట్‌తో పాటు పలు సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆర్మీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇవాళ ఆందోళనల్లో పాల్గొన్నవారికి గతంలో ఫిజికల్‌ టెస్టు పూర్తయిందని, రాత పరీక్ష మాత్రమే వారికి పెండింగ్‌లో ఉందన్నారు. పరీక్ష రద్దయిందనే రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆందోళనలకు దిగారన్నారు. ఈ ఘటనపై రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. నిరసనకారుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని ఎస్పీ అనురాధ తెలిపారు. రైల్వే ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదన్న ఆమె... ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై ఒక్కసారిగా దాడి చేశారన్నారు. ఆందోళనకారులు బోగీలు తగలబెట్టడంతో పాటు రాళ్ల దాడి చేశారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ అనురాధ వెల్లడించారు. 


రైళ్ల పునరుద్ధరణ 


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. పలు రైళ్లు ప్రారంభమయ్యాయి. కాకినాడ వెళ్లే రైలు ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధరించినట్లు స్టేషన్ డైరెక్టర్ టి.ప్రభు చరణ్ తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌, మైసూర్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి, విశాఖ వెళ్లాల్సిన రైళ్లు బయలుదేరాయని తెలిపారు.