5th september 2024 School News Headlines: 

Continues below advertisement


నేటి ప్రత్యేకత



  • జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ( సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. రాధాకృష్ణన్‌ భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి)

  • మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా వర్థంతి

  • ప్రపంచ యువజన దినోత్సవం


ఆంధ్రప్రదేశ్ వార్తలు:



  • ఇప్పటికే వరదతో అల్లాడిపోతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. నిన్న అర్ధ రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది.

  • ఆంధ్రప్రదేశ్ వరదలు సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎన్టీఆర్‌ జిల్లాలో 23 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు. అదేవిధంగా వరదల కారణంగా 212 పశువులు, 60 వేల కోళ్లు చనిపోయాయి


Read Only: Weather Latest Update: నేడు మరో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ


తెలంగాణ వార్తలు:



  • నేటి నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. జయశంకర్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు రుతుపవన గాలుల ద్రోణి 1,500 మీటర్ల ఎత్తున రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి మధ్యప్రదేశ్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించి ఉంది.

  • తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద బీభత్సం సృష్టించగా.. ఆ నష్టం వివరాలు తక్షణమే పంపాలని లేఖలో పేర్కొంది. 1345 కోట్ల SDRF నిధులు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వరదల్లో సాయం చేసేందుకు ఇప్పటికే 12 NDRF బృందాలను పంపించామన్నారు.


జాతీయ వార్తలు: 



  • దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. టీచర్ల గొప్పతనాన్ని చాటుతూ విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయులుగా.. విద్యార్థులు మెరిసిపోతున్నారు. సహచర విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు

  • దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి తరాన్ని అద్భుతంగా తయారు చేసే బాధ్యత..టీచర్లపైనే ఉందని గుర్తు చేశారు.


అంతర్జాతీయ వార్తలు:



  • ఉత్తరకొరియా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలుచేయాలని కిమ్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

  • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. టెక్సాస్‌లో వ‌రుస‌గా ఐదు వాహ‌నాలు ఒక‌దానినొక‌టి అతివేగంగా ఢీకొన‌డంతో ఓ కారులో భారీ మంట‌లు అంటుకున్నాయి. దీంతో నలుగురు భారతీయులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.


Read Only : Dhanush Srikanth: గురి చూస్తే అర్జునుడు గుర్తు రావాల్సిందే ! ధనుష్‌ శ్రీకాంత్ తోపులకే తోపు


క్రీడా వార్తలు:


పారాలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఈ మెగా టోర్నీలో తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజి అనే యువతి మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. దీప్తిని అభినందించారు


మంచి మాట


దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.-సర్వేపల్లి రాధాకృష్ణన్‌