Revanth Reddy will go to America to attract investments :  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అధికారులు, మంత్రుల బృందంతో ఆయన ఆగస్టు మూడో తేదీన అమెరికాకు బయలుదేరుతారు. అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించి మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు.  పలు కంపెనీల సీఈఓ లు, పారిశ్రామికవేత్తలను కలసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత  ఆగస్టు 11న హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.


జనవరిలో దావోస్ లో రేవంత్ పర్యటన 


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో సారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో దావోస్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు జనవరిలో హాజర్యయారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.  ఇటీవల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు అమెరికాలో పర్యటించారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు. వారం రోజుల పాటు పర్యటనలో ఆయన  తెలంగాణ  ప్రవాసులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నాయని వాటిని ఫాలో అప్ చేసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


మైక్రోసాఫ్ట్‌లో సాంకేతికత సమస్య, ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు


అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులే టార్గెట్                                      


బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ .. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అరుదుగానే విదేశీ టూర్లకు వెళ్లారు. కానీ కేటీఆర్ మాత్రం మొత్తం బాధ్యత తనపై వేసుకుని దావోస్, అమెరికా, యూరప్ సహా పలు దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకునేవారు. ఇప్పుడు నేరుగ ముఖ్యమంత్రే విదేశీ పర్యటనకు వెళ్తూండటంతో.. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.                                           


బీఆర్ఎస్‌తో పొత్తు, విలీనంపై బీజేపీలో విభజన - ముగ్గురు ఎంపీల తీవ్ర వ్యతిరేకత ?


ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కీలక కంపెనీల భాగస్వామ్యం


ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున విదేశీ కంపెనీల భాగస్వామ్యం ఉండాలని రేవంత్ కోరుకంటున్నారు. ముఖ్యంగా మూసీ అధునీకీకరణ లాంటి ప్రాజెక్టుల విషయంలో విదేశీ సంస్థల సాయం ఉండాలని భావిస్తున్నారు. అలాగే ఫార్మా, టెక్ రంగాల్లో హైదరాబాద్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.