Rangareddy News: తెలంగాణలో ఇంకా కొన్ని చోట్ల పూర్వ కాలంలో జరిగిన సంఘటనలే జరుగుతున్నాయి. అప్పట్లో కొన్ని వర్గాల వారు, మిగతా వర్గాల వారిని  తక్కువ కులం వాళ్లుగా ట్రీట్ చేసేవారు. వాళ్లను తమ ప్రాంతాల్లోకి రానిచ్చే వారు కూడా కాదని తెలిసిందే. వాళ్లు వాడే బావుల్లో నీటిని తాగనిచ్చే వారు కాదు. రాను రాను పరిస్థితులు దాదాపు మారినా.. ఇంకా కొన్ని చోట్ల అలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.  దొరల పాలనలో జరిగిన అరాచకాలు కొన్నిచోట్ల నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఆధునిక యుగంలో కొంతమేర తగ్గినా కూడా, అక్కడక్కడా ఈ తారతమ్యాలు ఉన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో దళితులపై దాడులు జరగడం, చివరకు అవి వర్గాల మధ్య వివాదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. 






రంగారెడ్డి జిల్లాలో దారుణం
తాజాగా అలాంటి దారుణ ఘటన ఒకటి  రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తమ ప్రదేశంలోని జామకాయలు తెంపుతున్నాడని యజమాని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా  కొట్టారు. రంగారెడ్డి - షాబాద్ మండలంలోని  కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టాడు.  వద్దని ఎంత మొరపెట్టుకున్న వినకుండా తీవ్రంగా గాయపడేలా బాలుడ్ని ఆ ఇంటి యజమాని చితకబాదాడు. దీంతో బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సంఘటన గురించి తెలుసుకున్న దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.