Rains In Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గిపోతుండగా.. మరో అల్పపీడనం నేడు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 12 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఏపీ, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 
తెలంగాణలో భారీ వర్షాలు
ఓ అల్పపీడనం ముప్పు తొలగిపోగా, నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది మరో 12 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో 24 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో నైరుతి దిశ నుంచి గాలులు గంటకు 8 నుంచి 12 కి.మీ వేగంతో వీచనున్నాయి.





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లులు..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలపై ఉంది. నేటి నుంచి రెండు రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఈ 5 జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆగస్టు 16 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. తీరంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. 





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే ఒకట్రెండు చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.  
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.