Police Recruitment Board: పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినహాయింపునిచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వేషన్లు ప్రవేశ పెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. ఈ నోటిఫికేషన్ ను సవరిస్తూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ లో 25 శాతం అంటే 50 మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






ఆదివారం బేజీపీ కార్యాలయంలో నిర్వహించిన వాల్మికీ జయంతి కార్యక్రమమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. రామాయణం అంటే మొదటగా గుర్తొచ్చేది వాల్మీకి మహర్షి అని తెలిపారు. వాల్కీకులను ఎస్టీ జాబితాలో కలుపుతామన్న హామినీ సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేక పోయారని గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. వాల్మీకిలను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వాల్మికులను అవమానిస్తే... వాల్మికీ మహర్షిని అవమానించినట్లేనని తెలిపారు. 


సీఎం కేసీఆర్ నల్లపిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కామెంట్లు
కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం నీళ్లలో కలిపారన్నారు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్తున్నారని విమర్శించారు. ప్రతి 3 నెలలకోసారి నల్ల పిల్లితో పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఫాంహౌజ్ లో ఒక యువకుడు అనుమానాస్పదంగా చనిపోయారన్నారు. ఆ కేసు ఏమైందో కూడా తెలియదని విమర్శించారు. క్షుద్ర పూజలు చేసినంత మాత్రాన మంచి జరుగుతుందా? తాంత్రికుడి మాటలు నమ్మి పూజలు చేసి డబ్బులు పంచినంత మాత్రాన గెలుస్తాననుకోవడం మూర్ఖత్వం అన్నారు.


రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అవినీతి, అక్రమాలు చేసి కోట్లు సంపాదిస్తుంటే ఈడీ, సీబీఐ చూస్తూ ఊరుకుంటదా? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో, చీకోటి పత్తాల స్కాంలో, డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడు సంపాదించినవన్నో దమ్ముంటే బయటపెట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు.