Adilabad Lathi charge News : తెలంగాణలో విత్తనాలపై లొల్లి మొదలైంది. వర్షాలు రాక ముందు నుంచే విత్తనాల అమ్మకాలు షురూ చేసిన ప్రభుత్వానికి కష్టాలు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటైంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన మరింత విమర్శలపాలు చేస్తోంది.  


ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం అన్నదాతులు రోడ్డు ఎక్కారు. భారీగా వచ్చిన రైతులను కంట్రోల్‌ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కోతలతో అల్లడిపోతుంటే ఇప్పుడు ప్రభుత్వం విత్తనాలు కూడా అందివ్వలేని దుస్థితిలో ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. 


కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రతి సారీ ఇలాంటి పరిస్థితి ప్రజలకు తప్పడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్ అవుతున్నారు. విత్తనాల కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులపై లాఠీ ఛార్జ్ చేయడం ఏంటని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌ పాలనలో రైతుల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయని కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులని ప్రబుత్వం ఏం చేయలేకపోతోందని మండిపడుతోంది. 


అదిలాబాద్ లాఠీచార్జీని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్.రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అన్నారు. 


"విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం. ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో రాష్ట్ర వ్యవసాయాలను ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారి పోయింది. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 


మార్పు తెస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ తీసుకువస్తామన్న మార్పా?. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు అన్నింటిని సాఫీగా అందుకున్నది. కేవలం 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమార అయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యం."


"ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. రైతన్నలపై చేసిన దాడికి క్షమాపణ చెప్పాలి.  రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యవసాయ వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టైంలో సీఎం ఎన్నికల ప్రచారం పేరిట, ఢిల్లీ పర్యటన పేరిట రాజకీయాలు చేయడం ఏంటీ. "


ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి విత్తనాల కొరత, పంపిణీ, ప్రభుత్వ వైఫల్యంపై ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేయాలి. రైతన్నల కష్టాలు తొలగించే విధానం తీసుకురావాలి. లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 


ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు అంటూ ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి మంత్రులు, ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్తారా అంటు నిలదీస్తున్నారు. "పత్తి విత్తనాలే కాదు .. ఎరువు కింద ఉపయోగించే జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఆందోళనలు చేయాల్సి రావడం దురదృష్టకరం. జీలుగ విత్తనాలకే దిక్కులేదు. ఇక అసలు విత్తనాలు ఇస్తారన్న నమ్మకం రైతులలో ఎలా కలిగిస్తారు"


రైతులకు విత్తనాలు ఇవ్వలేని అసమర్ద కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్దత, నిర్లక్ష్యం కారణంగా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు."కాంగ్రెస్ వచ్చి రాష్ట్రంలో పాతరోజులు మళ్లీ తెచ్చింది. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. తాజాగా లాఠీఛార్జీలు మొదలయ్యాయి. "


"రైతులు అడుగుతున్నది రేషన్ బియ్యం కాదు. మనిషికి రెండు విత్తన ప్యాకెట్లు మాత్రమే ఇవ్వడానికి ఎందుకంత కష్టం. రైతులు అడుగుతున్నది పంట పండించడానికి కావాల్సిన విత్తనాలు. ఆరునెలలలో వ్యవసాయ తిరోగమనం మొదలైంది. ఒకవైపు అకాలవర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటుకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడిచిపెట్టి కేరళ, పంజాబ్‌లలో పర్యటిస్తున్నారు. విత్తనాల కొరత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు"


"రాష్ట్రంలో ప్రచారం ఫుల్లు .. పాలన నిల్లు  అన్నట్లు సాగుతోంది. వెంటనే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఏఏ జిల్లాలలో ఎంతెంత ఎరువులు, విత్తనాలు ఉన్నది శ్వేతపత్రం విడుదల చేయాలి" అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.