PM Modi Comments in Nagar Kurnool Meeting: గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool)లో నిర్వహించిన బీజేపీ (Bjp) బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడారు. 'బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ వంతు వచ్చినట్లుగా భావిస్తోంది. మల్కాజిగిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను. కాంగ్రెస్, బీజేపీ రెండూ అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. 7 దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవడం మినహా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. గరీబీ హఠావో నినాదం వారు ఇచ్చినా.. పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారు. గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 140 కోట్ల మంది భారతీయలు నా కుటుంబం. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందారు. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు రాబోతున్నాయి. తెలంగాణలోనూ వేగవంతమైన అభివృద్ధిని తీసుకురావాలి. కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాల వారికి ఎంతో మేలు జరిగింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి.' అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.


దేశంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది బీజేపీయేనని ప్రధాని మోదీ అన్నారు. 'బీజేపీని గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. మీ అభివృద్ధి కోసం రాత్రి, పగలూ పని చేస్తాను. మా పార్టీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపిస్తే కాంగ్రెస్ ఆటలు ఇక సాగవు. కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు వచ్చింది. నేను నిరంతరం ప్రజల కోసమే పని చేస్తున్నా. ఆర్టికల్ 370, అయోధ్య రామాలయ నిర్మాణం వంటివి కొన్ని ఉదాహరణలు.' అని పేర్కొన్నారు.


'ప్రజలు తీర్పు ఇచ్చేశారు'


ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని.. మూడోసారి ప్రధాని మోదీయేనని నిర్ణయించారని అన్నారు. 'మల్కాజిగిరిలో శుక్రవారం జన ప్రవాహాన్ని చూశాను. యువకులు, మహిళలు, వృద్ధులు ఇలా చాలా మంది రోడ్లపై నిల్చుని బీజేపీకి మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజల వ్యతిరేకతను చూశాను. మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత పదేళ్లలో కేంద్ర పథకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ వారు గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారు. తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించారు. ఇక్కడ ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు ఢిల్లీలో తెలుస్తుంది. ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వండి.' అని మోదీ పిలుపునిచ్చారు.


Also Read: Kavtiha: 'నన్ను ఈ కేసులో కావాలనే ఇరికించారు' - న్యాయ పోరాటం చేస్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత