దేశంలోని దాదాపు అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా ఇలాగే ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఆగస్టు 3న రూ.105.83 గా ఉంది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. హైదరాబాద్‌లో గత 10 రోజులకు పైగా ఇవే ధరలు ఉంటున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు తాజాగా ఇలా ఉన్నాయి.


తెలంగాణలో ఆగస్టు 3న పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.106.24, డీజిల్ ధర రూ.98.33 వద్ద ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధర 0.12 పైసలు, డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగింది.


ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా ఉంది. ఇక్కడ ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందు రోజుతో పోలిస్తే రూ.0.06 పైసలు పెట్రోల్ ధర పెరగ్గా.. డీజిల్ ధర రూ.0.06 పైసలు తగ్గింది.


ఏపీలో ఇంధన ధరలు ఇలా..
అమరావతిలో పెట్రోల్ ధర రూ.0.17 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.108.05 గా ఉంది. డీజిల్ ధర రూ.0.15 పైసలు తగ్గి రూ.99.62గా ఉంది. అయితే, అమరావతిలో గత 10 రోజుల ఇంధన ధరలను పరిశీలిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.


విశాఖపట్నంలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.32 ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.52 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో ఏకంగా రూ.048 పైసలు పెరిగి రూ.98.91గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా ఇంధన ధరల్లో సరాసరిన రూ.0.50 పైసల వరకూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.


తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కాస్త ఎక్కువగానే ఉంది. లీటరు పెట్రోలు ధర రూ.0.62 పైసలు పెరిగి రూ.108.21 కు చేరింది. కొద్ది రోజులుగా పెట్రోలు ధర పెరుగుదలలో ఇదే అత్యధికం. ఇక డీజిల్ ధర రూ.0.54 పైసలు పెరిగి రూ.99.73కు చేరింది.


కొద్ది నెలలుగా ధరలు పైపైకి..
గత ఏడాది కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఎగబాకిపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో ఆల్ టైం కనిష్ఠానికి ముడి చమురు ధరలు చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 2 నాటి ధరల ప్రకారం 71.48 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర రాష్ట్రాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి.