8 సంవత్సరాల మోదీ పాలనలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే బలమైన దేశంగా ఎదిగిందని అన్నారు. రైతులకు, యువతకు, మహిళలకు ప్రత్యేక పథకాలు తెచ్చామని వివరించారు. సర్జికల్ స్ట్రైక్స్ దేశ చరిత్రలో మైలురాయి అని, పాకిస్థాన్ విషయంలో మోదీ నాయకత్వంలో కఠినంగా వ్యవహరించామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ప్రభుత్వం సేవ, గరీబ్ కళ్యాణ్, అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల సేవకు అంకితం. మోడీ ప్రభుత్వం అవినీతి లేని ప్రభుత్వం. కొత్త కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకు సాగుతుంది. భారత దేశ వ్యతిరేక శక్తులను సమర్థ వంతంగా ఎదుర్కొన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ దేశ చరిత్రలో మైలురాయి. కోవిడ్ నివారణలో ప్రపంచ దేశాలకు భారత్ స్ఫూర్తిగా నిలిచింది. పాండమిక్ లోనూ ఆర్థిక వృద్ధి సాధించాం. కోవిడ్ సమయంలోనూ పథకాలు, బడ్జెట్ ఆపలేదు.


మోదీ పాలనలో ఇండియా ప్రపంచ దేశాల్లో బలమైన దేశంగా ఎదిగింది. రైతులకు, యువతకు, మహిళలకు ప్రత్యేక పథకాలు తెచ్చాము. మోదీ పాలనతో బీజేపీ దేశ వ్యాప్తంగా బలపడింది. తెలంగాణాలో 40 లక్షల మంది రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి చేకూరింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పసుపు రైతులకు కేంద్రం స్ప్రెస్ బోర్డు ద్వారా లబ్ధి చేకూర్చింది. పసుపు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశాం.


‘‘పసుపు దిగుమతి నిలిపేసి, ఎగుమతులు పెంచటం ద్వారా ధరలు పెరిగేలా చేశాం. పసుపు ఎగుమతుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. గత 2 సంవత్సరాలుగా బాంగ్లాదేశ్ కి పసుపుని ఎగుమతి చేస్తున్నాం. కవిత ఎంపీగా ఉన్న 5 సంవత్సరాల్లో పసుపు రైతులకు చేసింది శూన్యం. కేంద్రం సర్వ శిక్ష అభియాన్ కింద ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. తెలంగాణలో పాఠశాలలు దారుణంగా ఉన్నాయి. కేంద్ర నిధులు తప్పుదోవ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణలో శాంతి భద్రతలు క్షిణించాయి.. మహిళపై అత్యాచారాలు పెరిగాయి.
ఆయుష్మాన్ భారత్, ఫసల్ భీమా యోజన లాంటి పథకాలను అమలు చేయకుండా పేదలకు లబ్ధి లేకుండా చేస్తోంది.


కేసీఆర్ సర్కార్ అవినీతి సర్కార్. రానున్న రోజుల్లో మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ అవినీతి వల్లే దశాబ్దాలుగా దేశం వెనుకబడింది. ఆత్మనిర్బర్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం.. సఫలమయ్యాం.. కేసీఆర్ కేంద్రంతో సయోధ్య లేకుండా మొండిగా, అహంకారంగా పాలన చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ఇక్కడి ప్రజలకు అందలేదు. కేంద్రం నుండి వచ్చే నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. మమత బెనర్జీ చాలా రోజులుగా బీజేపీ వ్యక్తిరేక శక్తులను ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విఫలమవుతున్నారు. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయం అన్నారు. ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.’’ అని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు.