టీఎస్ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త తెలిపింది. డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ రాయితీతో బస్సులను అందించేందుకు టీఎస్ఆర్టీసీ సంస్థ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రకు సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా టీఎస్ ఆర్టీసీ సంస్థ భక్తుల కోసం కొంత రాయితీపై ప్రత్యేక టీఎస్ఆర్టీసీ బస్సులను సమకూరుస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నిజామాబాద్ లో తెలిపారు. 


టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సులలో అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు. అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట మనుషులు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితం అని తెలిపారు.


టీఎస్ ఆర్టీసీ వారి ప్రత్యేక బస్సులలో ఆడియో, వీడియోతోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఈ బస్సును అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుండి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడిపిస్తారు. భక్తుల కోసం అందుబాటులో టీఎస్ఆర్టీసీ డిపోలలో అవసరమైన బస్సులు అందుబాటులో ఉంచారు. శబరిమల యాత్ర దూర ప్రయాణం కావడం వల్ల టీఎస్ఆర్టీసీ సురక్షితమైన డ్రైవర్లతో నడుపుతున్న బస్సు ప్రయాణం సురక్షితం, శుభ ప్రదమని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.


ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కోసం, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల కోసం www.tsrtconline.in వెబ్ సైట్ ఉపయోగించుకోవాలని కోరారు. ‘‘అడ్వాన్స్ బుకింగ్ పై 10 శాతం రాయితీ పొందండి. సలహాలకు, సూచనలకు, ఫిర్యాదుల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040 - 23450033, 69440000 సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్ లను సంప్రదించాలి’’ అని ఆర్టీసీ ఛైర్మన్ కోరారు. శబరిమల యాత్రలకు టీఎస్ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని టీఎస్ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు.