Sriram Sagar Project: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి క్రమంగా వరద ప్రవాహం వస్తోంది. 10 రోజుల్లో 10 టీఎంసీల వరకు నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో 3 టీఎంసీలు కాళేశ్వరం జలాలు ఉండగా.. మిగిలిన జలాలు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహం అని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోచంపాడు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ముప్కాల్ పంప్ హౌజ్ నుంచి 4300 క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. గత రెండ్రోజులుగా 25వేల క్యూసెక్కుల వరద నీరు రావడం మొదలైంది. ఆదివారం ఉదయం ఎస్సారెస్పీకి 27,538 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జూన్ నుంచి ఇప్పటి వరకు 2.833 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. తెలంగాణలో వర్షపాతం సగటు దాటకపోయినా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద రాక ప్రారంభం అయింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా వానలు కురుస్తున్నాయి. వరినాట్లు పడుతున్న సమయంలో ఎత్తిపోతల ద్వారా నీటిని రైతాంగానికి అందిస్తున్నారు. 


గోదావరికి రెండ్రోజులుగా వరద పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గింది. ఆదివారం 10 వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ఈ సారి ఎస్సారెస్పీ నిండడం ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులోకి నీటి రాక విషయంలో గోదావరితో పాటు మంజిరా నదులపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. మంజీరా నుంచి నీరు వస్తుండడంతో గోదావరికి ప్రవాహం మొదలైనట్లు చెబుతున్నారు. గోదావరి వరద ఉద్ధృతి పెరిగితే కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ ను నిలిపి వేసే అవకాశాలున్నాయి. కానీ, వరద ప్రవాహం ఆశాజనకంగా లేకపోవడంతో ఎత్తిపోయాల్సి వస్తోంది. 


గోదావరి నదిపై తెలంగాణలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసింది ఈ ఎస్సారెస్పీ ప్రాజెక్టునే. అయితే దీన్ని 1963ల నిర్మించారు. అప్పుడు దీన్ని నీటిని నిల్వ చేసి నీటి పారుదలకు మాత్రమే ఉపయోగపడే జలాశయంగా చూశారు. కానీ 1983 తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన కేంద్రంగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ ఎత్తు 1091 అడుగులు కాగా... నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపు అడుగులు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ, సరస్వతీ కాలువ, లక్ష్మీ కాలువ, వరద కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుంటుంది. 


అయితే ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టు ఎప్పుడూ ఆగస్టులో నిండుతూ వచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం జులై రెండో వారంలోనే భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నిండిపోయింది. ఇలా జరగడం ప్రాజెక్టు హిస్టరీలోనే మొదటి సారి. అయితే 2013లో జులై 25న, గతేడాది జులై 22న, ఈసారి జులై 10న గేట్లు ఎత్తారు. వాస్తవానికి పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు చేరువలోకి వచ్చాక గాని మిగులు జలాలను వదలరు. కానీ ఎగువ నుంచి వరద వస్తుండటంతో తొలిసారి ముందస్తుగా గేట్లు ఎత్తాల్సి వచ్చింది.