తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ విశ్వవిద్యాలయం కూడా షెడ్యూలు విడుదల చేయనుంది. ఏకకాలంలో ఆలిండియా కోటా సీట్లకు, కన్వీనర్(కాంపిటెంట్ అథారిటీ) కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ ఏడాది నుంచే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసీసీ విడుదల చేసిన కౌన్సెలింగ్ షెడ్యూలునే కాళోజీ విశ్వవిద్యాలయం కూడా అనుసరించనుందని సమాచారం.


కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూలును విశ్వవిద్యాలయం సోమవారం (జులై 17) విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అభ్యర్థుల నమోదు ప్రక్రియ జులై 15తో ముగిసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్-యూజీ 2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారు ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.


18 నుంచి ‘క్యాప్‌’ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్..
కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సన్స్(CAP) కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు జులై 18, 19 తేదీల్లో హాజరుకావాలని కాళోజీ యూనివర్సిటీ సూచించింది. హైదరాబాద్ రాజ్‌భవన్ రోడ్‌లోని డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలంది. విద్యార్థులు జులై 18న ఉదయం 9 గంటలకు నీట్ తొలి ర్యాంక్ నుంచి 1,25,000 ర్యాంకుల మధ్య, మధ్యాహ్నం 12 గంటలకు 1,25,001 ర్యాంకు నుంచి 2,50,000 ర్యాంకు వరకు, జులై 19న ఉదయం 9 గంటలకు 2,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వచ్చినవారు పరిశీలనకు హాజరు కావాలని వర్సిటీ వర్గాలు తెలిపాయి.


నీట్ యూజీ కౌన్సెలింగ్ విడుదల..
నీట్‌ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 20  నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ(నర్సింగ్) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆలిండియా కోటా సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఆలిండియా కోటా సీట్లు, డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు, అన్ని ఎయిమ్స్‌లు, పుదుచ్చేరి కారైకల్ జిప్‌మర్‌లలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ(నర్సింగ్) సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్ నాలుగు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత సీట్ల కేటాయింపు జులై 27, 28 తేదీల్లో, రెండో విడత ఆగస్టు 16, 17, మూడో విడత సెప్టెంబరు 6, 7 తేదీల్లో ఉంటుంది. మూడు రౌండ్ల అనంతరం మిగిలిన సీట్లను చివరి విడతలో కేటాయించనున్నారు.
నీట్ యూజీ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial