Bandi Sanjay News In Telugu: ముదోల్: నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో శనివారం నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నారు. శనివారం బైంసాలో జరగనున్న బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 
గత ఏడాది బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర భైంసా నుండి కొనసాగించగా.. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో భైంసా భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు ముమ్మరం చేశాయి. ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఈ సభ నిర్వహించినట్లు నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్ తెలిపారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అభిమానులు వచ్చేదిశగ అన్ని గ్రామాలలో వాహనాల ఏర్పాట్లు చేశారు. 


గతేడాది బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ఇక్కడనుండే ప్రారంభించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన ప్రజాసంగ్రామ యాత్ర చేసి ఏడాది తర్వాత మళ్లీ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో భైంసా పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు దీంతో బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ముదోల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేసే దిశగా బీజేపీ శ్రేణులంతా వ్యూహం రచించి గ్రామాల్లో విస్తృతంగా రామారావు పటేల్ తో కలిసి ప్రచారం చేస్తూ ఆయన గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బండి సంజయ్ రాకతో ఆ ఉత్సాహం మరింత పెరిగి ముదోల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ద్వారా బీజేపీ వ్యూహం ఫలించే దిశగా అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ మేనిఫెస్టో - ఆ వర్గాలే లక్ష్యంగా హామీల వర్షం, అధికారం అందేనా!