BRS MLC Kavitha Bail News: లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి  జైల్లో ఉన్న ఎమ్మెల్సీ క‌వితకు భారీ ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిళ్లు వస్తున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్యే బెయిల్ వచ్చింది. క‌విత త‌ర‌ఫున  ప్రమఖ లాయర్ ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. 


కవిత తరఫున వాదనలు


ముకుల్ రోహత్గీ తన వాదనలో కీలకాంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే కవిత అరెస్టు అయ్యి 5 నెలలు దాటిందని కోర్టుకు తెలియజేశారు. ఈడీ కేసులో ఐదు నెలలు, సీబీఐ కేసుల్లో నాలుగు నెలలు జైల్లో ఉన్నట్టు వివరించారు. ఈడీ, సీబీఐ విచారణ కూడా పూర్తైందని ఛార్జ్‌ షీట్లు కూడా వేశారన్నారు. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయని తెలిపారు. ఇప్పటికిప్పుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే ఛాన్స్ కూడా లేదన్నారు. చాలా మంది ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తుంటారని దాన్నే పెద్ద నేరంగా చెప్పడం సరికాదన్నారు. వంద కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తు సంస్థలు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాయని తెలిపారు. ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని కోర్టుకు అభ్యర్థించారు. 


ఈడీ వాదనలు 


ఈడీ తరఫున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు కూడా కీలకాంశాలు ప్రస్తావించారు. కవితకు ఈడీ నోటీసులు వచ్చిన వెంటనే ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. అందులో సమాచారం పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు. వాటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని అన్నారు. విచారణ సమయంలో కవిత దర్యాప్తు అధికారులకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు. 



ఫోన్లు రోజూ మారుస్తారా: సుప్రీంకోర్టు


ఫోన్ల ప్రస్తావన వచ్చినప్పుడు సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా మంది ఫోన్లు, కార్లు మారుస్తారని కవిత తరఫున న్యాయవాది వాదిస్తుంటే... రోజూ ఇలా మారుస్తారా అని ప్రశ్నించారు. ఫోన్లు మార్చడం కామన్ కాదన్న ఈడీ న్యాయవాది.. ఈ కేసులో కావాలనే సాక్ష్యాలను కవిత నాశనం చేశారన్నారు. ఫోన్లలో డేటాను డిలీట్ చేయడం వేరు పూర్తిగా తుడిచివేయడం వేరని అన్నారు. కవిత మాత్రం కావాలనే ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆమె ఇచ్చిన ఫోన్లలో పది రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగామని ఈడీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. 


ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... కేసు విచారణ పూర్తైందని భావించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో బీఆర్‌ఎస్ వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని గత నెలాఖరులో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగా బెయిల్ రాలేదు. విచారణ వాయిదా పడింది. ఇప్పుడు విచారణలో బెయిల్ వచ్చింది. సీబీఐ, ఈడీ కూడా బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చాలా కాలం నుంచి కవిత జైల్లో ఉన్నారు. సీబీఐ చార్జిషీట్లు నమోదు చేసిందని.. దర్యాప్తు కూడా పూర్తవుతున్న టైంలో బెయిల్ అవకాశాలు మెరుగుపడినట్లుగా బీఆర్ఎస్ న్యాయవిభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: ఈడీ, సీబీఐ దర్యాప్తు పూర్తవడమే ప్లస్ - సిసోడియాకు ఇచ్చినట్లే - కవిత బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవీ