మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారు జామున అయనను అదుపులోకి తీసుకొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను జిల్లా ఆసుపత్రి తరలించారు. ఈ టైంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.


ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షని భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బిజేపి నేతలు అడ్డుకున్నారు. ముందు గేట్‌కి తాళం వేసి పోలీసులను లోనికి రానివ్వలేదు. పోలీస్ గో బ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గేటు తాళం పగులగొట్టి పోలీసులు మహేశ్వర్ రెడ్డి ఇంటి లోపలికి ప్రవేశించారు. పోలీసులను బీజీపీ నేతలు అడ్డుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. 


వైద్య పరీక్షలు చేసుకోవాలని మహేశ్వర్ రెడ్డికి పోలీసులు సూచించినా అయన నిరాకరించారు. ఉదయం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఆయన నివాసంలో పోలీసులు భారీగా మోహరించి, బలవంతంగా ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహేశ్వర్ రెడ్డి మాత్రం మాస్టర్ ప్లాన్ జీవో 220 రద్దు చేసే వరకు తన దీక్ష విరమించబోనని ఆసుపత్రిలో పేర్కొన్నారు.


నేతల సంఘీభావం 
మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ మహేశ్వర్‌రెడ్డి చేస్తున్న దీక్షలు బీజేపీ నేతలు భారీగా వచ్చి మద్దతు తెలిపారు. కిషన్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సంఘీభావం తెలిపారు. కొందరు నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడి మద్దతుగా నిలిస్తే మరికొందరు ఫోన్‌లో పరామర్శించారు. 


బీజేపీ సీనియర్ లీడర్లు డీకే అరుణ్, ధర్మపురి అరవింద్ ఆదివారం మహేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లేందుకు విఫల యత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆదివారం నాడు కట్టిదిట్టమైన భద్రత చేపట్టారు. అటుగా ఎవర్నీ రానీయలేదు. డీకే అరుణ, అరవింద్‌ను కూడా మహేశ్వర్‌ రెడ్డిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేదు. 


 మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ బీజేపీ శ్రేణులు నిర్మల్‌లో రెండోరోజు ఆందోళన కొనసాగించాయి. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు బైల్‌బజార్ చౌరాస్తాలో బైఠాయించారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయల్దేరారు. మార్గ మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. 


మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హోంశాఖ మంత్రి అమిత్‌షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరా తీశారు. లాఠీచార్జ్ చేసిన విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి, ఇన్‌ఛార్జి ప్రకాష్ జవదేకర్‌ నిర్మల్ రానున్నట్టు తెలుస్తోంది. 


మరోవైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించడాన్ని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా తప్పుపడుతోంది. ప్రతిగా ఇవాళ(సోమవారం) ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్‌ఎస్‌ నేతలు. పోటాపోటీ రాజకీయ వ్యూహాలతో నిర్మల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.