Bellampalli MLA Durgam Chinnaiah:


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తరువాతే గ్రామంలోకి అడుగు పెట్టాలంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని శతవిధాలా నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాహనం ముందుకు కదిలింది.


బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెళ్లారు. అయితే గత కొంతకాలం నుంచి పోడుభూముల పట్టా వ్యవహారంపై కుష్నపల్లి గ్రామస్తులు గుర్రుగా ఉన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాటలు చెప్పడం తప్పా, తమ చేతికి పట్టాలు రాలేదన్న కోపంతో దుర్గం చిన్నయ్య వాహనాన్ని అడ్డుకున్నారు.  గ్రామస్తుల నుండి నిరసన సెగ తగిలింది. పోడు పట్టాలు, గ్రామంలోని పలు సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించిన తరువాతే గ్రామంలోకి రావాలని గట్టిగానే చెప్పారు. 


దుర్గం చిన్నయ్య గ్రామస్తులను పక్కకు జరగమంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు నిరసనకు దిగిన వారిని పక్కకు నెట్టివేసి దుర్గం చిన్నయ్యకు ముందుకు పంపించే ప్రయత్నం చేశారు. దాంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ముందుకు కదిలింది. ఇన్ని రోజులు తమ సమస్యలు గుర్తుకురాలేదు, కానీ ఎన్నికలు అనగానే ప్రజలు గుర్తొస్తారా అంటూ స్థానికులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గత నెలలో రైతులపై నోరు జారిన దుర్గం చిన్నయ్య..
ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి నోరు జారి చిక్కుల్లో పడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.


మంచిర్యాల జిల్లా బేల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రైతుల గురించి మాట్లాడుతూ.. ఈ దేశంలో అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావద్దు, ఆత్మహత్యలు చేసుకొని చావాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు ఆకలితో చావకూడదని, ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని కేసీఆర్ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పబోయారు. కానీ దుర్గం చిన్నయ్య నోరుజారి రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనేశారు.