ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం జిల్లాలో ఆశించిన మేర పనులు జరగడం లేదు. జూన్‌ 13 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి ఈ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో కనీస వసతులు కల్పిస్తే విద్యార్థులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఇంజనీరింగ్‌ అధికారుల కొరత, శాఖల మధ్యసమన్వయ లోపంతో ఆశించిన మేర పనులు జరగడంలేదు. కొన్ని పాఠశాలల్లో పనుల గుర్తింపు ఇంకా అంచనాల దశలోనే ఉన్నాయ్. కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో పనులు జూన్‌ 10లోగా పూర్తికావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టలేదు.
 
జిల్లాలో 407 పాఠశాలలు ఎంపిక
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సర్కార్ బడుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 1100 పైగా పాఠశాలలు ఉండగా మొదటి విడతగా జిల్లావ్యాప్తంగా 407 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో ప్రధానంగా తాగునీటి సౌకర్యం, ప్రహరిగోడ, వంటగది, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌, గ్రీన్‌బోర్డులు, డిజిటల్‌ తరగతులు, విద్యుత్‌ సౌకర్యం, అవసరంమేర అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. కానీ ప్రస్తుతం అత్యవసరంగా 115 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా జూన్‌ 10లోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.


115 పాఠశాలల అంచనా నివేదికలు సమర్పించిన నేపథ్యంలో నిధుల విడుదల కాగా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలి. కానీ ఆ పరిస్థితులు జిల్లాలో కనిపించటం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు సంబంధించి ఇంకా అంచనా నివేదికలు సైతం సిద్ధం కాకపోవడం పనుల విషయంలో అధికారులకు ఏవిధమైన ఆసక్తి ఉందో తెలుస్తుంది.




అదనపు గదుల ఊసేలేదు.
జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో కొన్ని పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. ఆ పాఠశాలలకు పూర్తిస్థాయిలో నూతన భవనాలు నిర్మించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చినా ఆ పనులు సైతం ఇంకా అంచనాల దశలోనే ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో పూర్తిగా కూలిపోయే దశలో ఉన్న కోటగల్లి బాలికల పాఠశాల ఈ పథకం కింద ఎంపికైనా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షాకాలం కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పైకప్పులు పూర్తిగా ఊడిపోయాయ్. 


గతేడాది చనిపోయిన విద్యార్థి
గతేడాది వర్షాకాలంలో కరెంట్ తీగ తెగి విద్యార్థినికి కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. అయినా అధికార యంత్రంగం పట్టించుకోలేదు. ఇప్పటికీ స్కూల్ పరిస్థితి అలాగే ఉంది. ఉపాధ్యాయులు చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఏబీపీ దేశం కి విన్నవించారు. ఈ స్కూల్ పరిస్థితిపై గతేడాది ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకున్న వారే లేరు.