ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా పేరున్న నేత ధర్మపురి శ్రీనివాస్ (DS). రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా డీఎస్ కు పేరుంది. తృటిలో డీఎస్ కు సీఎం కుర్చీ మిస్సయ్యిందని జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రస్తావించేవారు. కేవలం ఫోన్ ఉంటే రాజకీయాలను చక్కదిద్దటంలో సిద్ధహస్తుడు అని స్వయానా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి డీఎస్ ను ప్రసంసించిన సందర్భాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ రెండు సార్లు పీసీసీ చీఫ్ గా చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

తొలి నాళ్ల నుంచీ డీఎస్ కాంగ్రెస్ పార్టీ లోనే ఉండేవారు. డీఎస్ కు ఆ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది కూడా హస్తం పార్టీనే. కానీ, 2014 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీఎస్ బీఆర్ఎస్ లోకి చేరటం, ఆ తర్వాత రాజ్యసభ పదవి రావటం జరిగిపోయాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత లభించకపోవటంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం డీఎస్ రాజ్యసభ పదవీ కాలం కూడా ముగిసింది. తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం కొనసాగాలని డీఎస్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
  

 

కాంగ్రెస్ పార్టీలో చేరికకు డీఎస్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆ పార్టీలో వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు డైలమాలో ఉన్న డీఎస్ గతంలో సోనియా గాంధీని కలవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. డీఎస్ సొంతగూటికి చేరుతారన్న ప్రచారానికి సోనియాతో భేటీ అనంతరం స్పష్టత వచ్చింది. హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గతంలో ఢిల్లీలో మకాం వేసిన డి.శ్రీనివాస్  కాంగ్రెస్ లో చేరేందుకు పార్టీ అగ్రనేతలను కలిసి జరిపిన చర్చలు ఫలించాయంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో చర్చలు ఫలించి తిరిగి సోంతగూటికి చేరడం ఖాయమైందని అంటున్నారు. 

 

డీఎస్ కాంగ్రెస్ లోకి ఎప్పుడు చేరతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఉగాదికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే... డీఎస్ లాంటి సీనియర్లు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అవసరం అని అధిష్టానం భావిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన డీఎస్ కు రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. డీఎస్ పార్టీలో చేరితే హస్తం పార్టీని వీడిన ఇతర సీనియర్ నాయకులు సైతం తిరిగి సొంతగూటికి వస్తారనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ను వీడిన సీనియర్లను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. 

 

సోనియా గాంధీతో డీఎస్ జరిపిన చర్చల ఫలితం.. ముందుగా డీఎస్ పెద్ద కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. మాజీ మేయర్ సంజయ్ గతంలో తండ్రితో పాటు బీఆర్ఎస్ లో కొనసాగారు. కానీ పార్టీ కార్యక్రమాలకు సంజయ్ దూరంగా ఉంటూ వచ్చేవారు. సంజయ్ తండ్రి మాటను కాదని బీఆర్ఎస్ పార్టీలో ఇష్టం లేకున్నా కొనసాగారన్న ప్రచారమూ జరిగింది.ఢిల్లీనుంచి క్లియరెన్స్ రావటంతో డీఎస్ కంటే ముందే డి. సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారన్న చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. డీఎస్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ వంటి సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీని నడిపించారు. డీఎస్ జిల్లా కాంగ్రెస్ కు పెద్దన్న పాత్ర పోషించారు. కనుక డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరటం మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా మీడియాతో జరిగిన చిట్ చాట్ లో డీఎస్ చేరిక సోనియా గాంధీ పరిధిలో ఉన్న అంశం... అలాంటి పెద్దలు పార్టీలోకి చేరితే పార్టీకి లాభం చేకూరుతుందంటే మంచిదే కదా అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీకి మేలు జరిగే నాయకులు వస్తే ఎవరూ వ్యతిరేకించినా వారికి సర్థిచెబుతున్నామని రేవంత్ అన్నారు. మొత్తానికి డీఎస్ కాంగ్రెస్ లోకి చేరతారని,  వచ్చే ఎన్నికల్లో డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగుతారని పార్టీ జిల్లా నేతలు భావిస్తున్నారు.