Crime News: జిగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఓ మహిళను గౌరవించకుండా దురుసుగా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకొనే ఖాకీలు ఇలా ప్రవర్తించడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 


జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పట్ల ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ అక్కడే ఉన్న ఓ వ్యక్తితో గొడవడుతోంది. ఆ సమయంలో అక్కడ వారితో మాట్లాడుతున్న ఏఎస్‌ఐ అనుసరించిన తీరు ఇప్పుుడ వివాదాస్పదంగా మారింది. 


వ్యక్తితో గొడవపడుతున్న మహిళను సముదాయించాల్సింది పోయి ఆమెపై లాఠీ ఎత్తారు ఏఎస్‌ఐ. ఆయనకు మరో కానిస్టేబుల్ వంతపాడారు. ఇద్దరూ ఆమెను చేతులతో పక్కకు నెట్టేసి లాఠీతో అదిలించారు. 


లాఠీ తీసుకొని ఆమెను కొడుతూ మహిళను అక్కడి నుంచి వెళ్లగొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఏఎస్‌ఐ ఆమెను లాఠీతో కొడుతుంటే అప్పుడే వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ఆమెను పక్కకు నెట్టేస్తున్నాడు. ఆమె ఏదో చెబుతున్నా వారి పట్టించుకోవడం లేదు. 


వారితో ఉన్న మహిళా హోంగార్డుతో చెప్పి ఆమెను సముదాయించాల్సింది పోయి వారే రంగంలోకి దిగి మహిళను నెట్టేయడం, కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోను అక్కడే ఉన్న కొందరు స్థానికులు షూట్ చేసి వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తున్నారు. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


ప్రజలను రక్షించాల్సి రక్షకబటులే ఇలా మారడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. బహిరంగ ప్రదేశంలోనే పోలీసులు ఇలా ఉంటే స్టేషన్‌లోపల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న ఉన్నతాదికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం అవేమీ పట్టడం లేదని విమర్శిస్తున్నారు. మనుషలంటే లెక్కలేదని స్ట్రీలనే గౌరవం లేకుండా ఇలా లాఠీతో కొట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అక్కడ ఏం జరిగి ఉన్నప్పటికీ అలా చేయడం తప్పని అంటున్నారు.