Congress Meeting In Mancherial District:
- ఈనెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
- బహిరంగ సభకు రానున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే


మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ నేతృత్వంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీలో ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వెల్లడించారు. 
నస్పూర్ లో నిర్వహించే సభా మైదానంను సోమవారం వారు పరిశీలించారు. కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఈ నెల 14వ తేదీన ఖరారు అయినట్లు తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో తొలిసారి మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న సభకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాఆర్ అంబేద్కర్ జయంతి రోజున సభను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 


కాంగ్రెస్ సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ భారీ భహిరంగ సభకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జైరాం రమేష్, కొప్పుల రాజు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జాతీయ, రాష్ట్రీయ ముఖ్య నేతలు హాజరవుతారని వారు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని కొక్కిరాల ప్రేమ్ సాగర్, కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు.