కామారెడ్డి జిల్లాలో లోన్ యాప్‌ నిర్వాకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకొని కట్టని వారిపై ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజురోజుకు పెచ్చుమీరిపోతున్న వారి ఆగడాలను భరించలేకపోతున్నారు బాధితులు. లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని చెల్లించకపోవడంతో వసూళ్ల కోసం నిర్వాహకులు చేస్తున్న పనులు శ్రుతి మించిపోతున్నాయి. రుణగ్రస్తుల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అసభ్యకరంగా మార్చేసి... ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో జరిగిన ఇలాంటి సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. లోన్ యాప్‌ బారిన పడ్డ బాధితుడు భరత్ కుమార్ అనే యువకుడు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన భరత్ కుమార్ అనే ఓ కాంటాక్ట్ ద్వారా యాప్ వచ్చింది. ఆ యాప్‌ను భరత్ కుమార్ ఓపెన్ చేసి వివరాలు ఫిల్ చేస్తే మూడు వేల రూపాయలు అకౌంట్లో వేశారు. 
ఆరు రోజుల తర్వాత భరత్‌ 3000లకు 6000 రూపాయలను రెట్టింపు చెల్లించాడు. ఇలా సుమారు రెండు లక్షల వరకు భరత్ కుమార్ లోన్ తీసుకొని పూర్తిగా చెల్లించగా మరో లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని మెసేజ్ పెట్టి వేధించారు. అంతేకాకుండా ఇష్టం వచ్చిన విధంగా ఆ యాప్ కు సంబంధించిన మహిళలు బూతులు తిడుతూ భరత్ కుమార్ ను వేధించారు. 


తిట్లతోపాటు భరత్ కుమార్ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆయనకు సంబంధించిన కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వారందరికీ వాట్సాప్‌ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భరత్ కుమార్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


నిజామాబాద్ జిల్లాలో సైతం ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయ్. అమాయకుల అవసరాలను క్యాష్ చేసుకుంటూ.... ప్రైవేట్ యాప్‌లు దోపిడీకి పాల్పడుతున్నారు. తీసుకున్న డబ్బులు ఒక్క రోజు లేట్‌గా చెల్లించినా... డబుల్ వడ్డీ వసూల్ కు పాల్పడుతున్నారు. బయటికి చెప్పుకోలేక చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ యాప్ వారు బాధితుల పూర్తి వివరాలను ట్రాక్ చేస్తూ... వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బులు కట్టని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ నగ్నంగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కొందరు మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ప్రయివేట్ యాప్ లను నిర్ములించాలని కోరుతున్నారు జిల్లా వాసులు.