ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా, ఆది చాలదన్నట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్లో కొంత మంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్ ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 


గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్ కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్ లో చర్చనీయాంశంగా మారింది. రిమ్స్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్కడ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్ కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. 


మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ. 3 వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్) లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు, స్టాఫ్ నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 96 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్ పై రాసుకొని గ్రూప్లో సెండ్ చేశారు. ఇంక్రిమెంట్ కాక పోతే పీఆర్సీ, ఐఆర్ లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూపు డిలీట్ చేశారు. 
డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగుల టేబుల్ పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికీ చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం అయితే. విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్లు తెలుస్తొంది. 


రిమ్స్ లో పైసా వసూల్ తతంగం తెలిసిన విషయంతో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ఆసుపత్రిలో తనిఖీ చేసారు. ఇంక్రిమెంట్ ల గురించి డబ్బులు వసూలు చేస్తున్న విషయంపై ఆయన సిబ్బందితో విచారణ చేపట్టారు. ఐదుగురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని వేరే విభాగాల్లోకి మార్చారు. ఈ సందర్భంగా ప్రిన్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో ఇంక్రిమెంట్లు ఇతర విషయాలపై డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి రావడంతో దీనిపై ఐదుగురు సభ్యులతో విచారణ చేయడం జరుగుతుందని, ఒకవేళ ఆ విచారణలో అది రుజువైతే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.