ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాగైతే కృష్ణా నదీ జలాలను పంపిణీ చేస్తున్నామో ఇక మీదట కూడా అలాగే చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తేల్చి చెప్పాయి. మరికొన్ని రోజులు పాత పద్దతినే అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది.


ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం ఇచ్చినట్లే పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందులో నుంచి చిన్న నీటివనరుల విభాగంలో వినియోగించిన జలాలు, ప్రకాశం డెల్టాకు మళ్లించే గోదావరి జలాల పంపిణీని మినహాయింపుగా చేసినట్లు తెలిపింది.


ఆగస్టు 2న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు రెండు కలిసి సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేశాయి. అయితే మే 10న నిర్వహించిన 17వ సర్వసభ్య సమావేశంలో పాత పద్దతిలోనే నీటి వినియోగానికి అంగీకరించాయి. 


కానీ..ఏమైందో ఏమో తెలంగాణ మాత్రం దానికి ససేమిరా అంది. ఒప్పుకొలేదు. 66:34 కాదు 50:50 కావాల్సిందే అంటూ పట్టుపట్టింది. దీని గురించి మరోసారి కేంద్ర జల్‌ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. దీంతో కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్‌..75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ముందు అంచనా వేసింది.


1976 మే 27న బచావత్‌ ట్రైబ్యునల్‌ మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ విషయాల గురించి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ లో కూడా పేర్కొంది. 


ఆ తరువాత జూరాలకు 17.84 , శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకున్న నీటిని పరిగణనలోకి తీసుకొని.. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు తాత్కలిక పంపిణీ చేసుకోవడానికి అనుమతిలిస్తున్నట్లు 2015లో జల్‌శక్తి సమక్షంలో రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయనే అంశాన్ని గురించి కూడా ప్రస్తావించాయి.


ఆ తరువాత ఏడాది అదే పద్దతిలో నీటిని పంపిణీ చేసుకున్నట్లు కూడా ఆ అఫిడవిట్‌ లో పేర్కొన్నాయి. ఆ తరువాత నుంచి గోదావరి జలాలు మినహాయించి..మిగతా నీటిలో ఏపీ 66 శాతం, తెలంగాణ 33 శాతం చొప్పున పంచుకుంటున్నాయనే అంశాన్ని వివరించింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్ విచారణ చేస్తోందని..ఆ ట్రైబ్యునల్ అవార్డు వస్తేనే నీటి లెక్కలు తేలతాయని కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు స్పష్టం చేశాయి.