Cyber Crime : ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల నారాయణపేట్ కలెక్టర్ ఫొటోతో వాట్సాప్ ఖాతా తెరిచి డబ్బు కొట్టేసిన ఘటన మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఫొటోతో ఫేక్ వాట్సాప్ నంబర్ తో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్లు సృష్టించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు మరో అడుగు ముందుకేశారు. జిల్లా కలెక్టర్‌ పేరుతో వాట్సాప్‌ నెంబర్‌ తయారు చేసి జిల్లా అధికారుల నుంచే వసూళ్లు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో అధికారులు మేల్కొని సైబర్‌ నేరగాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. 


కర్ణాటక నుంచి ఆపరేట్ చేస్తున్న కేటుగాడు


ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ పేరుతో ఆయన డీపీ పెట్టి ఓ వాట్సాప్‌ కాంటాక్ట్‌ నెంబర్‌ తయారుచేసిన సైబర్‌ నేరగాడు.. జిల్లాలోని అధికారులకు, ప్రముఖులకు కలెక్టర్‌ పేరుపై డబ్బులు పంపాల్సిందిగా మెసేజ్‌లు పెట్టాడు. అయితే ఈ విషయం కాస్త కలెక్టర్‌ దృష్టికి రావడంతో వెంటనే దీనిపై ఫిర్యాదు చేయాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ చక్రవర్తికి ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత కలెక్టర్‌ పేరుపై వేరే నెంబర్‌ నుంచి ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా స్పందించవద్దని అధికారులకు సూచనలు చేశారు. కాగా ఈ ఫోన్‌ నెంబర్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు కర్ణాటక రాష్ట్రం నుంచి నెంబర్‌ ఆపరేట్‌ అవుతున్నట్లు కనుగొన్నారు. సైబర్‌ నేరగాళ్ల కొత్త పోకడ కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. 


నారాయణపేట్ కలెక్టర్ పేరుతో మోసాలు 


కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్‌ ఖాతా ఓపెన్ చేసి పలువురికి మేసెజ్ పంపి రూ.2.4 లక్షలు కొట్టేశాడు. ఎస్పీ వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్‌ తో నారాయణపేట్ కలెక్టర్‌ దాసరి హరిచందన ఫొటోతో వాట్సాప్‌ ఖాతా తెరిచి, దానితో పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు మెసేజ్ లు పంపించాడు. 


కలెక్టర్ ఫొటోతో నకిలీ ఖాతా


ఈ సందేశాలతో ఓ వ్యక్తి అమెజాన్‌ పే యాప్‌ ద్వారా పలు దఫాలుగా రూ.2.4 లక్షలు సైబర్‌ నేరగాడు వేయించుకున్నాడు. కలెక్టర్ ఫొటో ఖాతాను సందేశాలు వచ్చిన అధికారులు విషయాన్ని ఆరా తీయగా నకిలీ ఖాతా అని తేలింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్‌సీఆర్‌పి పోర్టల్‌ ద్వారా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వాట్సాప్‌ నంబర్‌కు జిల్లా అధికారులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దాని నుంచి వచ్చే సందేశాలు నమ్మొద్దని కలెక్టర్‌ హరిచందన కూడా స్వయంగా తెలిపినట్లు సమాచారం. ఈ నంబర్ నుంచి ఎవరికైనా మెసేజ్ లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేక్ వాట్సాప్‌ ఖాతాతో మోసం చేసిన వ్యక్తి జార్భండ్‌ రాష్ట్రానికి చెందినవాడుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అధికారుల ఫొటోలు పెట్టి డబ్బులు అడుగుతున్నారని, అలా ఎవరైనా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సైబర్‌ నేరాల నుంచి రక్షణకు టోల్‌ఫ్రీ నం.1930 కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ఇలాంటి నకిలీ ఖాతాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.