ఆర్జీవీ కన్ను ఇప్పుడు తెలంగాణ చరిత్రపై పడింది.  రాయలసీమలో పరిటాల రవి బయోపిక్ రక్త చరిత్రను, ఆంధ్రాలో వంగవీటి రంగ బయోపిక్ వంగవీటిని, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఎలా తీసారో తెలంగాణలో కూడా అదే స్థాయిలో  కొండా మూవీని నిర్మించారు. తెలంగాణ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతులను ఎంచుకుని వారి  బయోపిక్ ను  కొండా సినిమాగా నిర్మించారు.  ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయిందని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ట్రైలర్ రిజీల్ ఫంక్షన్ లో ఆర్జీవీ ప్రకటించారు. అయితే ఈ సినిమా కొండా ఫ్యామిలీ పొలిటిక్ కెరీర్ కు  ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ లో హాట్ టాక్ నడుస్తుంది.




వివాదస్పద సినిమాలు నిర్మించడంలో ఆర్జీవీ పెట్టింది పేరు. ఆర్జీవి ఏదైనా సినిమా టైటిల్ ను  అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యేదాక అడుగడుగునా కంట్రవర్సీలను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ కాంట్రవర్సీల ద్వారానే మీడియాను ఉపయోగించుకొని తన సినిమాలకు ఫ్రీ గా పబ్లిసిటీ చేసుకుంటారు. ఇలాంటి టెరిఫిక్ డైరెక్టర్ కన్ను తెలంగాణ చరిత్రపై పడింది. తెలుగు రాష్ట్రాల్లోని కోస్తా ఆంధ్ర, రాయలసీయ ప్రాంతాల్లో పేరుమోసిన రాజకీయ నాయకుల బయోపిక్ లను సినిమా తీసిన  వర్మ తెలంగాణలో కొండా దంపతులను ఎంచుకున్నారు. కొండా మురళి  గురించి తెలసుకునేందుకు తాను చేసిన ప్రయత్నంలో విస్తుపోయే నిజాలు తెలిశాయని ఆర్జీవి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. కొండా మురళి పేరు చెప్పగానే చాలా మంది మాములు వ్యక్తి కాదని చెప్పడంతో తనకు సినిమా తీయాలనే ఆలోచన మరింత బలపడిందని చెప్పుకొచ్చారు.

 

ఈ సినిమా తీసేందుకు కొండా చరిత్రను తెలుసుకునేందుకు జరిగిన జర్నీలో తాను కొండా మురళితో ప్రేమలో పడిపోయానని ఆయనను అంతగా ఇష్టపడ్డానని కొండా మూవీ షూటింగ్ ప్రారంభం రోజు ఆర్జీవి తెలిపారు.  అనుకున్నట్టుగా 4 నెలలో చిత్రం షూటింగ్ పూర్తవడంతో జనవరి 26 ఉదయం 10.25 గంటలకు కొండా మూవీ ట్రైలర్ ను హనుమకొండలోని కొండా క్యాంప్ కార్యాలయంలో ట్రైలర్ ను  విడుదల చేశారు. 30 ఏళ్ల క్రితం జనవరి 26న కొండా మురళిపై జరిగిన ఫైరింగ్ ఆధారంగానే ఈ చిత్రం నిర్మించామని ఆర్జీవి తెలిపారు. ఫైరింగ్ కు ముందు ఫైరింగ్ తరువాత ఏం జరుగుతుందనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఫంక్షలో కొండా మురిళి జీవిత చరిత్ర తీయాలంటే అయిదారు సినిమాలు అవుతాయని త్వరలోనే కొండ-2 మూవీ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు.


అయితే కొండా మూవీ గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న కొండా ఫ్యామిలీకి రాజకీయంగా లబ్ది చేకూరుతుందని వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక 3 ఏళ్ల నుంచి కొండా దంపతులు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో కొండా దంపతుల పని అయిపోయిందని, ఇక రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొండా మూవీ నిర్మించడం కొండా దంపతులకు ప్లస్ అవుతుందని  విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ చిత్ర  ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో కొండా మురళి, కొండా సురేఖ వ్యాఖ్యలు ఈ అభిప్రాయాలను బలపరుస్తున్నాయి. ఇక పై ప్రజలకు అందుబాటులో ఉంటామని ఏ సమస్య వచ్చినా తన వద్దకు రావచ్చని కొండా మురళి ప్రకటించారు. సింహం బయటకు వచ్చేలా ప్రతిపక్ష నాయకులు చేశారని తమ పవర్ ఏంటో చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఇదే స్థాయిలో కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు చేశారు. కొండా చిత్రాన్ని ఎవరు ఆపిన ఆగదని  ఇక పై తాము ఏంటో చూపిస్తామన్నారు. చిత్ర షూటింగ్ జరగకుండా ఎన్ని శక్తులు అడ్డగించినా ఆగలేదని అలాగే చిత్ర విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరని  తేల్చిచెప్పారు.   మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సినిమాతో రాజకీయాలు వేడెక్కనున్నాయి.