Karimnagar News: ఆరు సంవత్సరాల కిందట జరిగిన అక్రమాలకు ఇంకా ముగింపు పలకడం లేదు కరీంనగర్ రిజిస్ట్రేషన్ శాఖ చెందిన అధికారులు. కాలం ముందుకు కదులుతున్నా లక్షల్లో మాయమైన సొమ్ము రికవరీ మాత్రం కావడం లేదు. కరీంనగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2016 మార్చి నెలలో బయట పడిన స్టాంపుల కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన సొమ్మును ఇంటి దొంగలే కొట్టేశారా? అనే విషయమై పలుమార్లు విచారణ జరిగింది. కొందరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఐదు రోజుల కిందట కార్యాలయంలోని ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా గతంలో జరిగిన కథ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 


మాయమైన డబ్బు తిరిగి చేర్చడంలో నిర్లక్ష్యం..


జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పర్యవేక్షణ లోపం నిర్వహణకు ప్రధాన శాపంగా మారుతోంది. ఆ డిపార్ట్మెంట్లో అత్యధిక రాబడిని ప్రతి ఆర్థిక సంవత్సరంలో అందించే జిల్లాగా కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యవహారాలు మాయని మచ్చగానే మిగిలిపోతున్నాయి. 2016 లో జరిగిన గోల్ మాల్ వల్ల జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు చెడ్డ పేరు వచ్చింది. 3 ఏళ్ళ ముందే ఇక్కడ స్టాంపులను ఏ మాత్రం పరిరక్షణ లేకుండా అమ్ముతున్నారనే విషయాన్ని అప్పట్లో ఎడిట్ అధికారులు గుర్తించారు. అమ్మిన వాటికి, జమ చేసిన సొమ్ముకు భారీ తేడా ఉండడాన్ని కూడా గమనించారు. ఉన్నతాధికారులు అప్పట్లో తగిన దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే తర్వాత మళ్లీ ఇంత పెద్ద తప్పిదం జరిగేందుకు ఆస్కారం లేకపోయేది. 70.76 లక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత 2019 మార్చి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా నిలిపివేశారు. చలాన్ల తోపాటు ఆన్లైన్ తరహాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ పెద్ద మొత్తంలో మాయమైన సొమ్మును తిరిగి చేర్చడంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యమే ఇప్పటి వరకు కనిపించింది.


సొమ్ము స్వాధీనం అవుతుందా, లేదా?


ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం.. స్వాధీన పరచుకునేలా ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.  స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని కరీంనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యూడిషియల్ స్టాంప్ కాగితాలు ప్రత్యేకంగా అతికించే ఫ్రాంక్లింగ్ యంత్రంతో స్టాంపులు అమ్ముతుంటారు. ఇలా రోజువారీగా వచ్చే నగదు ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ఖాతాకి జమ చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఇలా నిధులు పక్కదారి పట్టిన విషయంలో ముగ్గురు ఉద్యోగులపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.


మొదట్లో తక్కువ సొమ్ము అని భావించిన అధికారులకు విచారణలో ముందుకు వెళుతున్న కొద్దీ కళ్ళు బైర్లు కమ్మాయి.  పరిశీలనలో రూ. 70,76,926 నిధులు మాయం అయినట్లు గుర్తించారు. 2013 నుంచి 2016 వరకు రికార్డులను గమనించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులకు తగినంత సమయం ఇవ్వడంతోబాటు.. వివరణ కోరడం కోసం షోకాజు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోనట్టే కనిపిస్తోంది. అసలు అవినీతి ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తారా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.