Telangana News: కరీంనగర్ జిల్లాలో ఒక కుటుంబంపై మరో వర్గానికి చెందిన కులస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన భూత మల్లేశం అనే వ్యక్తి కుటుంబంపై మరో వర్గానికి చెందిన వారు.. గుంపులుగా వచ్చి దాడి చేశారు. భూత మల్లేశం ఓ కులానికి చెందిన కుటుంబం కాగా.. వీరిపై మరో కుల సంఘానికి చెందిన సుమారు 50 మంది ఒకేసారి వచ్చి దాడి చేయడం కలకలం రేపింది.


దాడిలో గాయపడ్డ భూత మల్లేశం తల్లి, కుటుంబ సభ్యులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. వారం రోజుల క్రితం ఇదే కులానికి చెందిన ఒక వ్యక్తి మరో కులానికి చెందిన వ్యక్తితో గొడవ పడగా గొడవకు సంబంధం లేని కుటుంబంపై దాడి చేసి ఆ కులస్తులు గాయపరిచారని అంటున్నారు. కులం పేరుతో దూషించారని, అలాగే ఈ గ్రామం నుండి నిన్ను బహిష్కరిస్తున్నామని బెదిరింపులకు గురి చేస్తూ దాడి చేశారని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. దీనిపై విచారణ చేపట్టి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకున్నాడు.