Telangana PGECET 2024 Results: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 18న వెల్లడించనున్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ-హైదరాబాద్ హెచ్‌గోల్డెన్‌ జూబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌, అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి జూన్ 17న ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు.


ఫలితాల కోసం వెబ్‌సైట్..


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. హైదరాబాద్, వరంగల్‌లోని పలు కేంద్రాల్లో జూన్ 10 నుంచి జూన్ 13 వ‌ర‌కు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అమ్మాయిలు 12,532 మంది, అబ్బాయిలు 10,180 మంది ఉన్నారు. వీరిలో ఫార్మసీకి 7,376 మంది, కంప్యూటర్‌ సైన్స్‌-ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి 4,903 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 10 సబ్జెక్టులకు 100 మంది లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్నవారిలో 20,626 (90.82%) మంది పరీక్షలకు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 18న విడుదలచేయనున్నారు. 


రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'TS PGECET-2024' నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ మార్చి 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ద్వారా మార్చి 16 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇక రూ.250 ఆల‌స్య రుసుంతో మే 14 వ‌ర‌కు దరఖాస్తులు స్వీకరించారు. అదేవిధంగా రూ. 1000 ఆలస్య రుసుముతో మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.2,500 ఆలస్య రుసుముతో మే 21 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మే 28న హాల్‌టికెట్లు విడుదల చేసి.. జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించింది.




ఏ రోజు ఏ పరీక్ష నిర్వహించారంటే..?


➥ జూన్ 10న జియో ఇంజినీరింగ్ అండ్ జియోఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు.


➥ జూన్ 11న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.


➥ జూన్ 12న ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జిక్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.


➥ జూన్ 13న ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, నానోటెక్నాలజీ విభాగానికి పరీక్షలు నిర్వహించారు.


అర్హత మార్కులు ఇలా..
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..