Air Pollution in Ramagundam: ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక నిమిషంపాటు ఎక్కడైనా కాలుష్యపు పొగ గాని ఏదైనా ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ము ధూళి గాని కొద్దిసేపు వస్తేనే ఊపిరాడక విలవిల్లాడిపోతాం. కానీ 39 సంవత్సరాలుగా ఆ ఊర్లకు పక్కనే ఉన్న పరిశ్రమ వదిలే కాలుష్యాన్ని పీలుస్తూ ఆయుష్షును కోల్పోతున్నారు. ఇక గ్రామంలో నివసించలేమని మరోచోట పునరావాసం కల్పించాలని, అక్కడ నివసిస్తున్న ప్రజలు 100 రోజులపాటు పెద్ద ఎత్తున దీక్షలు ఆందోళనలు చేపట్టిన ఎవరు కనికరించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద చెరువుల కాలుష్యం నుంచి తమను కాపాడాలని అంతర్గామ్ మండలం భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు. 


కరకట్టల ఎత్తు పెంచడంతో బూడిద నిల్వ పెరిగింది..


అటవీ ప్రాంతానికి ఆనుకొని రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో పచ్చని చెట్లు గుట్టల మధ్య రాజాపూర్, కుందనపల్లి గ్రామం ఉండేది. పవర్ ప్రాజెక్ట్ కోసం వేలాది ఎకరాల సాగు భూములను కోల్పోయారు. రాజాపూర్ గ్రామాన్ని వదిలేశారు. సేకరించిన భూముల్లో నాలుగు బూడిద చెరువులు ఏర్పాటు చేశారు. ఈ చెరువులు వారికి శాపంగా మారాయి.


భారీ ఎత్తున బూడిదను నిల్వ చేయడంతో నాలుగు దశాబ్దాల కాలంలో ఇక్కడి నేల, నీరు,గాలి విషతుల్యంగా మారాయి. చుట్టూ పది కిలోమీటర్ల దూరం వరకు పర్యావరణ కాలుష్యంగా మారింది. బూడిద చెరువుల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్ని దశల్లో కరకట్టల ఎత్తు పెంచారు. దీంతో బూడిద నిల్వ పెరిగింది. గాలులకు బూడిద పైకి లేచి నివాస గృహాలను నింపేసేది. నిర్వాసితుల ఆందోళనతో చెరువులో ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నా, అవి తాత్కాలికంగానే మిగిలింది. శాశ్వత చర్యలు చేపట్టలేదు. 


1930 మంది వరకూ మృత్యువాత..


బూడిద కాలుష్యంతో తాము జీవించలేని మరోచోట పునరావాసం కల్పించాలని రెండున్నర దశాబ్దాలుగా గ్రామస్తులు ఉద్యమాలు చేపడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి స్థానిక, రాష్ట్ర కేంద్ర మంత్రుల కార్యాలయాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పరిశీలనలు, నివేదిక సమర్పణల వరకే పరిమితమయ్యారు. ఇక్కడి గ్రామ ప్రజలు 30 నుంచి 65 ఏళ్లలోపు వారే ఎక్కువగా మరణిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు బూడిద కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్న వయసులోనే ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం రికార్డుల ప్రకారం 1930 మంది మరణించగా.. అందులో అనారోగ్యంతో మరణించిన వారు 160 మంది ఉండగా, అందులో 65ఏళ్లలోపు వారు 130 మంది ఉన్నారు. 


అయితే వారు ఉద్యమం తీవ్రతరం చేసినప్పుడు శాంతింప చేయడానికి వస్తున్న అధికారులు, నాయకులు తిరిగి మళ్లీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నాయకులు ఎవరికి తమ బాధను చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. కనీసం పునరావాసం కోసం కంపెనీ యజమాన్యం దృష్టి సారించి సహాయం చేసినట్లయితే తమ బ్రతుకులు బాగుపడతాయని వారు కోరుతున్నారు.