Karimnagar News : కరీంనగర్ జిల్లాలో కీడు సోకిందని  గ్రామస్తులంతా ఊరు ఖాళీ చేసిన ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి గ్రామస్తులు గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి తోటల్లో మకాం పెట్టారు.  ఆ ఊరిలో వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరికి అరిష్టం పట్టిందని అందుకే ఊరు చివర చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఊరి చివర ఉండి తిరిగి ఇంటికి వెళ్తామన్నారు. దీనికంతటికి కారణం గ్రామంలో ఇటీవల అనారోగ్యాల బారిన పడి ఆరుగురు మృతి చెందడంతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు ఈ వింత నిర్ణయం తీసుకున్నారు. ఊరికి కీడు సోకడంతో వరుసగా చనిపోతున్నారనేది గ్రామస్తుల మాట.



నెల వ్యవధిలో ముగ్గురు మృతి 


తమ గ్రామానికి కీడు సోకిందనే మూఢ నమ్మకంతో ఊరు ఊరంతా ఖాళీ చేసి గ్రామ శివార్లకు వెళ్లారు. గురువారం ఉదయం గ్రామస్తులంతా తమ నివాసాలు విడిచి శివారులోని పంట పొలాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే వంటలు చేసుకున్నారు. ఈ గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన సుమారు 300 కుటుంబాలు సాయంత్రం వరకు గ్రామాన్ని వదిలి పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పండితుల సూచనతో గ్రామాన్ని విడిచి శివార్లలో మకాం వేశామని పలువురు చెబుతున్నారు. అంతా బయటకు రావడంతో ఆ గ్రామం నిర్మానుషంగా మారింది.  


చీమల భయంలో ఊళ్లు ఖాళీ 


 దెయ్యాలు ఉన్నాయని, ఆత్మలు తిరుగుతున్నాయని భయంతో ఊర్లు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. చేతబడులు చేశారన్న సందేహంతో ఊళ్లకు ఊళ్లే వసల వెళ్లిన ఘటనలు కూడా చూశాం. కానీ చీమలకు భయపడి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారంటే ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటే మీరు పొరపడినట్లే. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తున్న చీమలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  


అసలేం జరిగింది? 


 తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప‌ గ్రామాల్లోని ప్రజలను చీమలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. గత కొంత‌ కాలంగా చీమలు అటవీ ప్రాంతాన్ని వదిలి గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా ఏది దొరికితే దానిని ఆరగించేస్తున్నాయి. రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేయడంతో పాటుగా, ఎలుకలు, పిల్లులు, కుందేళ్లలపై దాడి చేసి వాటి చంపేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో ఎల్లో క్రేజీ చీమలు గ్రామాల్లో వస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిముషాల్లో మనుషులపై పాకుతూ ఫార్మిక్ యాసిడ్ ను విడుదల చేస్తున్నాయి. ఇలా ఫార్మిక్ యాసిడ్ ను విడుదల చేయడం ద్వారా మనిషి శరీరంపై దురదలు, చర్మం పొట్టులా రాలడం జరుగుతున్నాయి. పశువుల కంట్లో ఈ చీమలు పడితే పూర్తిగా చూపు కనిపించకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు చీమల దండుకు భయపడి ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. చీమల నివారణకు అనేక మందులు ఉపయోగించినా ఏమాత్రం వాటిపై ఫలితం చూపలేకపోతుండడంతో స్థానికులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.  


ఎల్లో క్రేజీ చీమలు 


గత కొంత కాలంగా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప ప్రాంత ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అటవీశాఖ అధికారులు, కీటక శాస్త్రవేత్తలు రంగంలోకి దిగ్గారు. అటవీ ప్రాంతంలోని చీమల నమూనాలను సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు, వీటి నైజంను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలోని తొలి 100 ప్రమాదకరజాతుల్లో వీటిని చేర్చారని పర్యావరణవేత్త వైల్డ్ లైఫ్ పరిశోధకులు అంటున్నారు. ఎల్లో క్రేజీ యాంట్ దాడులు గతంలో కేరళ అడవుల్లోని పలు గ్రామాల్లో కనిపించాయని వీటిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రతినిధులు పరిశోధన జరిపారని అధికారులు అంటున్నారు.  తాజాగా ఎల్లో క్రేజీ చీమ జాతుల విస్తరణ బాగా పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  


Also Read : Rajanna Sircilla: అత్యాధునిక టెక్నాలజీతో రెడీ అవుతున్న రాజన్న సిరిసిల్ల నూతన పోలీస్ కార్యాలయం


Also Read : Telangana BJP: హైదరాబాద్‌లో పోస్టర్లు కలకలం, రాత్రికి రాత్రే గోడలపై ప్రత్యక్షం