Jayashankar News: గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు చేపట్టి పెద్ద గుంత తీసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావుసింగ్ పల్లిలో జరిగింది. ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బావుసింగ్ పల్లికి అదే గ్రామానికి చెందిన అజ్మీరా సారయ్య, విజయ దంపతుల ఇంట్లో నుండి తవ్వకాల శబ్దాలు, మట్టి తోడుతుండటంతో స్థానికులకు వచ్చి చూశారు. వారు డొంకతిరుగుడు సమాధానం చెబుతుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అజ్మీరా సారయ్య, విజయ దంపతుల ఇంట్లోకి వెళ్లిన పోలీసులు లోపల పెద్ద గుంత తీసినట్లు గుర్తించారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపడుతున్నట్లు అజ్మీరా సారయ్య, విజయ దంపతులు పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. 


Also Read: Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు ! ఇంటిని తవ్వించేసుకున్నాడు !


కలలో కనిపించి చెప్పిన దేవుడు


నిద్రపోతున్నప్పుడు కలలో దేవుడు కనిపించి ఇంట్లో బంగారం ఉందని చెప్పాడని అజ్మీర సారయ్య, విజయ దంపతులు చెబుతున్నారు. వారు సమీప బంధువులకు ఇదే విషయం చెప్పడంతో వారంతా కలిసి అజ్మీరా సారయ్య నివాసం తవ్వకాలకు పూనుకున్నారు. ఇంట్లో ఓ మూలన రెండు చదరపు అడుగుల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టారు. 3 నుండి 4 అడుగుల లోతు వరకు తవ్వినట్లు తెలుస్తోంది. పక్కనే దేవుడి చిత్రపటం ఉంచి దీపం వెలిగించారు. ఇందుకోసం సమీప బంధువులైన రతన్ సింగ్, రాజ్ కుమార్ లను పిలిపించారు. అశోక్, రమేష్, రాజు, ఓదెలు అనే వ్యక్తులను పిలిపించి వారితో తవ్వకాలు మొదలు పెట్టారు. 8 మంది కలిసి తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాల చప్పుళ్లు రావడం, మట్టి తోడుకుపోతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూసి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించారు. ఇంట్లో గుప్త నిధుల కోసం గుంతలు తవ్వుతున్న 8 మంది నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. 8 మందిని రిమాండ్ కు తరలించి పూర్తి స్థాయి వివరాల కోసం విచారించనున్నట్లు స్థానిక సీఐ వేణు చందర్ తెలిపారు. గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగిన విషయం ఆ నోటా ఈ నోటా బావుసింగ్ పల్లి అంతా తెలిసింది. ఇప్పుడు గ్రామంలో ఏ ఇద్దరూ కలిసినా గుప్త నిధుల గురించే మాట్లాడుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. 


Also Read: Gupta Nidhulu: వరంగల్‌లో గుప్త నిధులు, 1000 బంగారు నాణెల కేసులో 8 మంది అరెస్ట్.. ఎన్నో ట్విస్టులు


'సారయ్య ఇంట్లో రెండు చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 3 నుండి 4 అడుగుల మేర తవ్వకాలు చేపట్టారు. స్థానికుల నుండి సమాచారం రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేశాం. అజ్మీరా సారయ్య, విజయ దంపతులతో పాటు బంధువులైన రతన్ సింగ్, రాజ్ కుమార్ లు.. అశోక్, రమేష్, రాజు, ఓదేలు అనే మరో నలుగురు వ్యక్తుల సాయంతో తవ్వకాలు చేపట్టారు. పోలీసులు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి గుప్త నిధులు దొరకలేదు. దీనిపై కేసు నమోదు చేసి నిందితులు 8 మందిని రిమాండ్ కు తరలిస్తాం' అని సీఐ వేణు చందర్ తెలిపారు.