KTR :  తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభ వేడుకలు అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.  సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా సచివాలయాన్ని నిర్మించి.. అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. 


సచివాలయ ప్రారంభ అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని ఆదేసించారు. జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామని..ఇంచార్జిలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. సచివాలయ  ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
  
150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్ ను నిర్మించారు.  20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్‌ ఉంటుంది.


 సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్  సభకు  తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. దీంతో భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. 


ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజు కూడా కావడంతో..  బీఆర్ఎస్ నేతలు ఆ రోజున మామూలుగానే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఇప్పుడు పుట్టిన రోజుతో పాటు రెండు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నందున మరింత జోష్ గా ఈ వేడుకలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.