Weather Report in Telangana: వేసవి ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటికబురు అందించింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో రానున్న 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. 


ఈ జిల్లాల్లో వర్షాలు


మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, వికారాబాద్, ములుగు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


వర్షపాతం నమోదు


రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకూ 9 జిల్లాల్లో వందకు పైగా ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో అత్యధికంగా 5 సెం.మీలు, కరీంనగర్ లో 4 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఆదివారం కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 2 - 4 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: Kavitha ED Office: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను కలిసిన భర్త అనిల్ సోదరుడు కేటీఆర్‌, హరీష్ రావు