Ladies Special Bus trip route 127K from Koti To Kondapur: మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి బస్టాప్ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి లక్దికాపుల్, మసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో బస్సు కోఠికి తిరిగి వస్తుందని తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ సూచించింది.




ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక - ఆ రూట్ లో బస్సుల పునరుద్ధరణ 
కుషాయిగూడ - అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఆగస్టు 16 నుంచి ఆర్టీసీ పునరిద్దరించింది. గత పది సంవత్సరాలుగా మౌలాలీ కమాన్ రూట్ బంద్ ఉండగా... ప్రత్యామ్నాయంగా మౌలాలీ హౌజింగ్ బోర్డు కాలనీ గుండా బస్సులను నడిపింది. తాజాగా ఆ రూట్ లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలీ కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈ 3వ నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలీ కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఆ రూట్ లో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ - అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. 


హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ బస్సులు రయ్ రయ్ 
త్వరలో హైదరాబాద్ రోడ్లపైకి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది.  త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. 


ఈ మేరకు హైదరాబాద్‌ బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 50 హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనుండగా.. అందులో  20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయని, మరో 30 ఐటీ కారిడార్లో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సజ్జనార్ వివరించారు.