హైదరాబాద్‌లో గ్రూప్‌ 2 కోసం ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య రాజకీయ మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ యువతి మరణంపై రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. అటు నిరుద్యోగుల్లోనూ ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. 


ఓ ప్రైవేటు హస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ప్రవళిక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ప్రవళికది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి. డిగ్రీ పూర్తి చేసిన ప్రవళిక రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది. గ్రూప్2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురైన ప్రవళిక హాస్టల్ రూంలో సూసైడ్ చేసుకున్నట్టు స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఆమె పేరు మీద సూసైడ్ నోట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


రాత్రి హైడ్రామా మధ్య ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం పూర్తి చేశారు. వెంటనే స్వగ్రామానికి ప్రవళిక డెడ్‌బాడీని తీసుకొచ్చారు. పోలీస్ బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లికి మృతదేహం చేరుకుంది. ప్రవళిక మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 
ఇది ప్రభుత్వ హత్యగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రవళిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు రాత్రి అశోక్‌నగర్ చేరుకున్నారు. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌సహా ఇతరులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవళిక మృత దేహం తరలింపును అడ్డుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మెరుపు ధర్నాకు దిగారు. 






ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్డుపైకి రావడంతో చిక్కడిపల్లి పరిసరాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో రాజకీయనాయకులను బలవంతంగా పోలీసులు వారి ఇళ్లకు తరలించారు. ధర్నా చేస్తున్న అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేశారు. మాట వినని వారిని ఈడ్చి పడేశారు. బలవంతంగా అభ్యర్థులను అక్కడి నుంచి తరలించి ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. 


ప్రభుత్వం, పోలీసుల తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్థరాత్రి జరిగిన హైడ్రామా విజువల్స్ వైరల్‌గా మారాయి. 


అటు బీఆర్‌ఎస్‌ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. 


తమ స్వార్థ రాజకీయాల కోసం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ బీఆర్‌ఎస్ తన ఎక్స్ అకౌంట్‌లో విమర్శలు చేసింది. మొన్నటి వరకు గ్రూప్ 2ను వాయిదా వేయాలని డిమాండ్ చేసిన వీళ్లే ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. తస్మాత్ జాగ్రత్త ఇలాంటి నీచ రాజకీయ నాయకుల కుట్రలకు, కుతంత్రాలకు బలి కావొద్దని తెలంగాణ యువతకు సూచనలు చేసిందా పార్టీ.